అసెంబ్లీ ఎన్నికల(Assembly elections)కు ఎన్నికల సంఘం (Election Commission) సర్వం సిద్ధం చేస్తోంది. ఈ క్రమంలో ఎన్నికల వేళ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని యోచించింది. అలాగే ఈసీ(EC) తాజాగా మరో ముఖ్యమైన విషయాన్ని ప్రకటించింది.
అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాల్లో ఎగ్జిట్ పోల్స్(exitpolls)ను నిషేధిస్తూ ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. ఫలితంగా తెలంగాణ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మిజోరం రాష్ట్రాల్లో ఈసీ ఉత్తర్వులు అమల్లోకి వచ్చాయి. నవంబర్ 7 నుంచి నవంబర్ 30 సాయంత్రం 6.30 గంటల వరకు నిషేధం అమల్లో ఉంటుందని ఈసీ వెల్లడించింది.
తెలంగాణలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి పోలీసు(police)లను ఈసీ అప్రమత్తం చేసింది. పోలీసులు ఎక్కడికక్కడ చెక్ పోస్టులు(checkpost) ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ తనిఖీల్లో సరైన పత్రాలు చూపించినా పోలీసులు చిన్నచిన్న కారణాలతో నగదును స్వాధీనం చేసుకుంటున్నారని సమాచారం. దీంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ విధంగా పట్టుబడిన నగదు ఇప్పటి వరకు రూ.140 కోట్లకు చేరింది. నిజానికి రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తులు తమ సొంత అవసరాలకు, ఇతర ఖర్చులకు నగదు తీసుకుంటుండగా.. పోలీసులు ఆ నగదును స్వాధీనం చేసుకున్నారు.
ఆ నగదుపై ఈసీ (Election Commission) కీలక ఆదేశాలు జారీ చేసింది. నిబంధనల ప్రకారం ఉంటే ఆ నగదును తిరిగి ఇచ్చేయాలని ఈసీ చెబుతోంది. రాజకీయాలతో సంబంధం లేనివారికి ఆ నగదును వెంటనే ఇచ్చేయాలని సూచించింది. ఈ విషయాన్ని ఎలక్షన్ కమీషన్ సీనియర్ డిప్యూటీ కమిషనర్ నీతీష్ కుమార్ వ్యాస్ తెలిపారు.
త్వరలో నామినేషన్ల స్వీకరణ ప్రారంభమయ్యేలా ఏర్పాట్లు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి అక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీసులను సూచనలు చేశారు. ఎన్నికల కోడ్ అమలులో ఉండగా.. ఎక్కడా రాజీ పడవద్దని, ఎవరినీ ఉపేక్షించవద్దని పోలీసులు, అధికారులను ఆయన ఆదేశించారు.