కొల్లాపూర్ లో నిర్వహించిన పాలమూరి ప్రజాభేరి బహిరంగ సభలో రాహుల్ గాంధీ కాంగ్రెస్ ఇచ్చిన హామీలను ప్రజలకు మరోసారి గుర్తు చేశారు. రాష్ట్రంలో అధికారంలోకి వస్తే గ్యాస్ సిలిండ్ కేవలం రూ.500కే అందిస్తామన్నారు. మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళలకు రూ. 2500 ఇస్తామని హామీ ఇచ్చారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని చెప్పారు. రైతు భరోసా కింద రైతులకు రూ. 15 వేలు అందిస్తామని స్పష్టం చేశారు. రైతు కూలీలకు రూ. 12 వేలు ఇస్తామని భరోసా ఇచ్చారు.
సీఈసీ కీలక భేటీ ఉన్నా ఇక్కడికి వచ్చానన్నారు రాహుల్ గాంధీ. తెలంగాణలో ఒకవైపు సీఎం కేసీఆర్ కుటుంబం ఉందన్నారు. మరోవైపు తెలంగాణ సమాజం, నిరుద్యోగులు, మహిళలున్నారని తెలిపారు. దొరల తెలంగాణలో ఏం జరుగుతుందో ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు.
కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో రూ.లక్షల కోట్ల అవినీతి జరిగిందని రాహుల్ గాంధీ మరోసారి ఆరోపించారు. బీఆర్ఎస్, బీజేపీ కలిసి తెలంగాణ ప్రజల సొమ్మును దోపిడీ చేశాయని విమర్శించారు.రూ. లక్షల కోట్ల సొమ్మును పన్నుల రూపంలో వసూలు చేస్తున్నారని మండిపడ్డారు.
తెలంగాణ ప్రజలతో తనకు ఉన్నది రాజకీయ అనుబంధం కాదని కుటుంబ అనుబంధమని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ప్రియాంక అనారోగ్యంతో ఉండటం వల్లే తాను ఇక్కడకి వచ్చానని తెలిపారు. సంక్షేమ పథకాలు అమలు కావాలంటే తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం రావాలని పిలుపునిచ్చారు. ప్రజల తెలంగాణ.. దొరల తెలంగాణ మధ్య ఈ ఎన్నికలు జరగనున్నాయని రాహుల్ గాంధీ అన్నారు. కాంగ్రెస్ ను గెలిపించాలని కోరారు. ఇచ్చిన హామీలన్నీ తప్పకుండా నెరవేరుస్తామని భరోసా ఇచ్చారు.