Meerpet Crime : ఇటీవల కాలంలో చదువుల ఒత్తిడి భరించలేక విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడుతున్న ఘటనలు పెరుగుతున్నాయి. తాజాగా మీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో మరో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. కాలేజీ యాజమాన్యం.. ఎక్కువ మార్కులు రావాలని పెట్టే చదువుల ఒత్తిడిని తట్టుకోలేక ఎం.వైభవ్ (16) అనే విద్యార్థి సూసైడ్ చేసుకున్నాడు. తన చావుకి కారణం కాలేజీ యాజమాన్య వేధింపులేనని సూసైడ్ నోట్ లో రాశాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి.. వైభవ్ మృతదేహాన్ని పోస్టుమార్టమ్ కు తరలిస్తుండగా తల్లిదండ్రులు అడ్డుకున్నారు. తమకు న్యాయం జరిగేంతవరకూ పోస్టుమార్టం చేయడానికి వీల్లేదని ఆందోళనకు దిగారు.
మీర్ పేట పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఓం సాయినగర్ కాలనీకి చెందిన కృష్ణవేణి – ఆనంద్ దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్దకొడుకు వైభవ్ నారాయణ కాలేజీలో ఇంటర్ ఫస్టియర్ చదువుతుండగా.. రెండో కొడుకు 7వ తరగతి చదువుతున్నాడు. వైభవ్ కు టెన్త్ లో 8.3 పాయింట్లు రాగా.. ఇక్కడ అంతకన్నా ఎక్కువమార్కులు రావాలని యాజమాన్యం ఒత్తిడి చేయడంతో మంగళవారం ఉదయం 6.30 గంటలకు సూసైడ్ నోట్ రాసి ఉరివేసుకుని ఆత్మహత్యచేసుకున్నాడు. చైతన్యపురి నారాయణకాలేజ్ లో చదువుతున్న వైభవ్.. సూసైడ్ నోట్ లో ఇలా రాశాడు.
“వైభవ్ అనే నేను చైతన్యపురిలోని నారాయణ కాలేజ్ లో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్నాను. ఇంకా ఎక్కువ మార్కు తెచ్చుకోవాలని కళాశాల ఉపాధ్యాయులు, ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్ లు టార్చర్ పెడుతున్నారు. వారి టార్చర్ భరించలేకే చనిపోతున్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ ఈ కాలేజీలో నా తమ్ముడిని చేర్పించొద్దు. విద్యార్థులను ఇలా తీవ్ర ఒత్తిడికి గురిచేయకండి. అతని భవిష్యత్ బాగుండాలని కోరుకుంటున్నాను. సారీ మమ్మీ..డాడీ, సోదరా. సారీ టు ఆల్” వైభవ్ సూసైడ్ నోట్ లో రాశాడు.