Israel-Hamas war in maps : గాజాలో పోరు ఉధృతమైన తరుణంలో ఆన్లైన్ మ్యాపులనుంచి ఇజ్రాయెల్ అదృశ్యమైంది. ఈతుంటరి పని చేసింది చైనా. బైడు డిజిటల్ మ్యాపుల్లో ఇజ్రాయెల్ పేరు కనిపించడం లేదంటూ వాల్ స్ట్రీట్ జర్నల్ మొదట వెలుగులోకి తీసుకొచ్చింది.
పాలస్తీనా, ఇజ్రాయెల్ భూభాగాలను వేరుచేస్తూ మ్యాపుల్లో చూపినా.. ఇజ్రాయెల్ను గుర్తించడం లేదన్న ధోరణిని ప్రతిబింబించేలా ఆ దేశం పేరును మాత్రం తొలగించేశారు. మ్యాప్లకు సంబంధించి.. చైనా దిగ్గజ కామర్స్ సంస్థ యాప్ అమాప్లోనూ అంతే. ఇజ్రాయెల్ రహిత మ్యాపుల్లో.. ఆ దేశం కన్నా చిన్నవైన లగ్జెంబర్గ్ లాంటి దేశాల పేర్లనూ మార్క్ చేసి ఉండటం గమనార్హం.
మ్యాపుల నుంచి ఇజ్రాయెల్ పేరును ఎందుకు తొలగించాల్సి వచ్చిందన్న దానిపై ఆ కంపెనీలు స్పందించాల్సి ఉంది. కాగా ఇజ్రాయెల్-హమాస్ వార్ 25వ రోజుకు చేరింది. గత 24 గంటల్లో 300కిపై హమాస్ టార్గెట్లపై ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) బాంబులు కురిపించింది. ఈ దాడుల్లో హమాస్ కీలక కమాండర్ నసీం అబు అజీనా సహా పలువురు టెర్రరిస్టులను ఏరిపారేశామని ఐడీఎఫ్ ప్రకటించింది.
కిబ్బుట్జ్ ఎరెజ్లో అక్టోబర్ 7 నాటి దాడుల్లో ఇజ్రాయెలీల ఊచకోతకు ప్రధానకారకుడు నసీం అని ఇజ్రాయెల్ సైనికులు తెలిపారు. గతంలో అతను హమాస్ వైమానికి విభాగం బాధ్యతలు చూశాడు. కాగా, ఈ పోరుకు సంబంధించి ప్రపంచానికివార్తలు అందించేందుకు వెళ్లిన 31 మంది జర్నలిస్టులు ఇప్పటివరకు ప్రాణాలు కోల్పోయారు. మరో 8మంది తీవ్రంగా గాయపడ్డారు.
తొమ్మిది మంది పాత్రికేయుల ఆచూకీ తెలియడం లేదు. యుద్ధం కవరేజి కోసం మొత్తం 2 వేల మందికి పైగా జర్నలిస్టులకు ఇజ్రాయెల్ అనుమతి ఇచ్చింది. వీరిలో అత్యధికంగా 358 మంది అమెరికా రిపోర్టర్లు ఉన్నారు. బ్రిటన్ జర్నలిస్టులు 281 మంది, ఫ్రాన్స్ 221, జర్మనీ పాత్రికేయులు 102 మంది యుద్ధరంగం నుంచి వార్తలు అందిస్తున్నారు.
ఇండియా నుంచి 55 మంది పాత్రికేయులు ప్రస్తుతం ఇజ్రాయెల్-గాజాలో విధులు నిర్వర్తిస్తున్నారు. అలాగే టర్కీ(71), ఇటలీ(63), కెనడా(56), స్పెయిన్(49), ఆస్ట్రేలియా(36), గ్రీస్(33), రష్యా(24), చైనా(19)తో పాటు మరిన్ని దేశాల జర్నలిస్టులు వార్తలు అందిస్తున్నారు.