Marathon Fasting : ఉపవాసం అంటే వారానికి ఒకరోజు చేస్తారు. ఇంట్లో ఏదైనా పూజ, వ్రతం ఉన్నప్పుడు ఇంటిల్లిపాదీ ఉపవాసం ఉంటారు. కార్తీక మాసంలో అయితే శివారాధకులు ప్రతిరోజూ ఒక్కపూట ఉపవాసం ఉంటారు. కొందరు ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఉపవాసం ఉండి.. రాత్రికి భోజనం చేస్తారు. కానీ.. ఓ యువతి ఏకంగా మూడు నెలల 20 రోజుల పాటు ఆహారం లేకుండా ఉపవాసం చేసింది. 16 ఏళ్ల వయసులో ఆ యువతి 110 రోజులపాటు ఆహారం లేకుండా ఉపవాసం చేయాల్సిన అవసరం ఏముందంటూ ఈ విషయం తెలిసిన నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. అసలు ఆ యువతి ఎందుకు ఇలాంటి సాహసం చేసిందో తెలుసుకుందాం.
ఆమె పేరు క్రిషా. వయసు 16 సంవత్సరాలు. ముంబైలోని పశ్చిమ కండివాలిలో ఉంటున్న ఓ కుటుంబంలో క్రిషా చిన్న కూతురు. క్రిషా షా కండివాలిలోని కెఇఎస్ కాలేజీలో 11వ తరగతి చదువుతోంది. క్రిషా తండ్రి జిగర్ షా స్టాక్ బ్రోకర్ కాగా, ఆమె తల్లి గృహిణి.క్రిషా మొదట 16 రోజుల ఉపవాసంతో తన దీక్షను ప్రారంభించింది. గురువైన ముని పద్మకలష్ మహారాజ్ ఉపవాస దీక్షకు అనుమతివ్వగా.. ఈ ఏడాది జులై 11న ఈ ఉపవాసాన్ని ప్రారంభించింది. మొదట ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6.30 గంటలవరకూ క్రిషా కేవలం వేడినీటిని మాత్రమే తీసుకునేది. ఉపవాస దీక్ష ప్రారంభించిన తర్వాత తనకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాకపోవడంతో.. తన ఉపవాసాన్ని మరో 10 రోజుల వరకూ పొడిగించాలని నిర్ణయించుకుంది.
ఇలా ఆమె తన ఉపవాసదీక్ష లక్ష్యాన్ని క్రమంగా పెంచుకుంటూ వెళ్లింది. 26 రోజులు.. ఆ తర్వాత 31, 51 రోజులు ఉపవాస దీక్షను పెంచింది. 51 రోజుల తర్వాత వాళ్లంతా పవిత్రంగా భావించే పర్యూషన్ మాసంలో ఉపవాస దీక్షను విరమిస్తుందనగా.. మళ్లీ 20 రోజులపాటు దీక్షను పెంచుకుంది. ఈ ఉపవాస దీక్ష చేస్తూనే ఆమె కాలేజీకి కూడా వెళ్లింది. అలా.. 71 రోజుల ఉపవాస దీక్ష తర్వాత.. క్రిషా ఆరోగ్యంపై కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. కానీ క్రిషా తన గురువుల ఆశీస్సులతో 110 రోజుల ఉపవాస దీక్షను అక్టోబర్ 28 శనివారం పూర్తి చేసింది.
ఈ మెగా ఫాస్ట్ కంటే ముందు.. క్రిషా 9 ఏళ్ల వయసులో 8 రోజుల ఉపవాసం, 14 ఏళ్ల వయసులో 16 రోజుల ఉపవాసాన్ని చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సాధువులు, సాధ్విలకే ఇలాంటిది సాధ్యమవుతుందని, ఎలాంటి దీర్ఘకాల ఉపవాస అనుభవం లేని క్రిషా.. 110 రోజులపాటు ఉపావాస దీక్ష చేయడం తమను ఆశ్చర్యానికి గురిచేసిందని జైనమత పెద్ద పేర్కొన్నారు. క్రిషా ఉపవాస దీక్ష ముగింపు కార్యక్రమంలో.. ఆమె గురువులైన ఆచార్య విజయహంసరత్నసూరి మహారాజ్, ముని పద్మాలక్ష్విజయ్ మహారాజ్ లు ఆశీర్వదించారు. ఉపవాస దీక్ష సమయంలో క్రిషా బలం కోసం మత గ్రంథాలను చదివేదని కుటుంబ సభ్యులు తెలిపారు. అలాగే.. తమ కూతురు 18 కిలోల బరువు తగ్గిందన్నారు. క్రిషా ఈ ఉపవాసం తనకు తానుగా ఇష్టపడి చేసిందే తప్ప.. ఎవరి ప్రోద్బలంతోనూ చేయలేదని ఆధ్యాత్మిక గురువు ముని పద్మకలష్ మహారాజ్ తెలిపారు. ఆమె దైవం కోసమే ఈ ఉపవాసాన్ని చేసిందన్నారు. దీర్ఘకాల ఉపవాసంలో అనుభవం లేకుండా.. అతిచిన్న వయసులో 110 రోజుల ఉపవాసం చేసిన వ్యక్తిని మొదటిసారి చూస్తున్నానని తెలిపారు. క్రిషా.. ముందు ముందు ఉన్నత లక్ష్యాలను చేరుకుంటుందని, అసాధ్యమైన విజయాలను అందుకుంటుందన్నారు.
కానీ.. నెటిజన్లకు మాత్రం క్రిషా ఇంతటి కఠిన ఉపవాస దీక్ష ఎందుకు చేసిందన్నది అంతుపట్టడం లేది. ఆమెకు అంతకష్టం ఏమొచ్చిందంటూ వాపోతున్నారు. ఇది ఇప్పుడు ఎలాంటి ప్రభావం చూపకపోయినా.. ముందు ముందు ఆరోగ్య సమస్యల్ని తెచ్చిపెడుతుందని హెచ్చరిస్తున్నారు.