Pakistan Cricket Board : వన్డే వరల్డ్ కప్ 2023లో ఎన్నో సంచలనాలు నమోదవుతున్నాయి. ఒకవైపు ఆఫ్గాన్ లాంటి చిన్న టీమ్ సంచలన విజయాలు నమోదు చేసి, పాయింట్ల పట్టికలో పైకి వెళుతోంది. మరోవైపు డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ అట్టడుగు స్థానంలోనే ఉండిపోయింది. ఇదిలా ఉండగా పాకిస్తాన్ ఆడుతున్న ఆటతీరుతో ఇక్కడ జట్టు సభ్యుల పరిస్థితెలా ఉందో తెలీదుగానీ.. అక్కడ పాక్ క్రికెట్ బోర్డులో ప్రకంపనలు రేగుతున్నాయి.
వీటన్నింటికి ఆజ్యం పోస్తూ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్ పాక్ క్రికెట్ టీమ్ చీఫ్ సెలక్టర్ పదవికి రాజీనామా చేశాడు. దీంతో ఒక్కసారిగా పొగ రాజుకుంది. జట్టు వైఫల్యాలకు అక్కడ బోర్డులో ప్రకంపనలు రేగడంతో అందరూ నివ్వెరపోతున్నారు. జట్టు సెలక్షన్ లో డబ్బులు చేతులు మారాయనే ఆరోపణలు రావడమే ఇందుకు కారణమని అంటున్నారు.
సరైన విచారణ లేకుండా అందరూ మాట్లాడుతున్నారు. అందుకే రాజీనామా చేస్తున్నాను. నాపై విచారణ చేయించి, నేను నిర్దోషినని తేలితే మళ్లీ చీఫ్ సెలక్టర్ గా ఉంటానని ఇంజమామ్ తెలిపాడు. మరోవైపు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు స్పందించింది. మీడియాలో వస్తున్న పరస్పర విరుద్ధ ప్రయోజనాల ఆరోపణలపై దర్యాప్తు చేపట్టేందుకు ఐదు సభ్యులతో కూడిన నిజ నిర్ధారణ కమిటీని నియమించింది. వారు త్వరలోనే నివేదిక అందిస్తారని పీసీబీ బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది.
ఇదిలా ఉండగా బాబర్ అజామ్ వాట్సాప్ స్టేటస్ ఒకటి లీక్ అయ్యింది. ఇది అగ్నికి ఆజ్యం పోసినట్టయ్యింది. ఈ మధ్యలో ఒక వదంతి కూడా రేగింది. జట్టుకి, బోర్డుకి మధ్య సహకారం లేదని ఐదు నెలలుగా జీతాలివ్వడం లేదని దాని సారాంశం.
ఇదే విషయమై బాబర్ ఆజామ్ పీసీబీ చీఫ్ జకా ఆష్రఫ్ తో మాట్లాడేందుకు ప్రయత్నించినా అతను మాట్లాడేందుకు నిరాకరించాడని మాజీ కెప్టెన్ లతీఫ్ రషీద్ ఆరోపించాడు.
ఈ తలనొప్పుల మధ్య బాబర్ ఆజామ్, పీసీబీ చీఫ్ ఆపరేటింగ్ ఆపీసర్ సల్మాన్ నసీర్ మధ్య జరిగిన వాట్సాప్ చాట్ ఒకటి లీక్ అయ్యింది. ఇది కొత్త సమస్యలకి దారి తీసింది. అసలింతకీ ఆ చాట్ లో ఏముందంటే…
‘బాబర్…నువ్వు ఫోన్ చేస్తే ఛైర్మన్ స్పందించడం లేదని టీవీల్లో, సోషల్ మీడియాలో వార్తలొస్తున్నాయి. అది నిజమేనా? నువ్వీమధ్య ఫోన్ చేశావా? అని నసీర్ అడిగాడు.
అందుకు బాబర్ .. ‘సలామ్ సల్మాన్ భాయ్..నేను ఆయనకు కాల్ చేయలేదు…అని రిప్లై ఇచ్చాడు.
ఇలా ప్రైవేట్ ఛాటింగ్ ను లీక్ చేయడంపై మాజీ క్రికెటర్ వకార్ యూనిస్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. రేపు పాకిస్తాన్ టీమ్ వరల్డ్ కప్ ముగించుకుని పాకిస్తాన్ లో దిగేసరికి ఏం జరుగుతుందోనని ఆటగాళ్లందరూ బిక్కుబిక్కుమని ఉన్నారు.
అయినా క్రికెట్ ఆడే జట్టు ఓడిపోతే, అది పాకిస్తాన్ దేశానికే దెబ్బ అనే స్థాయికి జనం దగ్గర నుంచి అధికారుల వరకు వెళ్లిపోవడం సరికాదని కొందరు అంటున్నారు. క్రికెట్ లో గెలిస్తే పాకిస్తాన్ ప్రతిష్ట పెరిగిపోతుందా? అని ప్రశ్నిస్తున్నారు. ఇది రాబోవు రోజుల్లో పాకిస్తాన్ క్రికెట్ కు మేలు చేయదని అంటున్నారు. ఇంకెవరూ ఆడేందుకు ఇష్టపడరని అంటున్నారు. వెస్టిండీస్ లాగే పాకిస్తాన్ తయారవుతుందని జోస్యం చెబుతున్నారు.