Hardik Pandya : టీమిండియాకి శుభవార్త. ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా మళ్లీ వచ్చేస్తున్నాడనే వార్తలు వస్తున్నాయి. ముంబయి వాంఖేడి స్టేడియంలో శ్రీలంకతో జరగబోయే మ్యాచ్ కి మాత్రం అందుబాటులో ఉంటాడని అంటున్నారు. అయితే మరి తుది జట్టులో ఎవరుంటారు ? అనేది ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది.
ఇప్పుడు హార్దిక్ పాండ్యా ప్లేస్ భర్తీ చేయడానికి అటు బౌలర్ గా షమీ, ఇటు బ్యాటింగ్ లో సూర్యకుమార్ యాదవ్ ని తీసుకున్నారు. ఒకరి బదులు ఇద్దరినీ తీసుకోవడమంటే జట్టుకెంత మైనస్ అని కొందరంటున్నారు. మొన్న ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో సూర్యకుమార్ యాదవ్ అంత ఒత్తిడిలో వచ్చి చక్కగా ఆడి 49 పరుగులు చేసి, స్కోరు బోర్డుని 200 దాటించాడు. లేకపోతే ఇంగ్లండ్ బ్యాటర్స్ కొంచెం జాగ్రత్తగా ఆడి మ్యాచ్ కొట్టేసేవారేనని అంటున్నారు.
ఇప్పుడు షమీ అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు. అతన్ని తొలగించడం ఆత్మహత్యా సదృశ్యమే అవుతుంది. సూర్యకుమార్ కూడా తనకి అప్పగించిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాడు. ఇక ఎటొచ్చి సెకండ్ డౌన్ వస్తున్న శ్రేయస్ అయ్యర్ కి పిడి పడిపోయేలా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఆడిన 6 మ్యాచ్ ల్లో 134 పరుగులు మాత్రమే సాధించాడు. 33.50 స్ట్రయిక్ రేట్ తో ఉన్నాడు.
రాబోవు రోజుల్లో జరిగే నాకౌట్ మ్యాచ్ ల్లో ఈ ప్రదర్శన సరిపోదు. అందువల్ల ఒకవేళ హార్దిక్ వస్తే మాత్రం షమీ, సూర్యకుమార్ లను ఉంచి, శ్రేయస్ అయ్యర్ కి చెక్ పెడతారని అంటున్నారు. శ్రీలంకతో జరిగే మ్యాచ్ లో సూర్యకుమార్ రుజువు చేసుకుంటే, తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నట్టే అంటున్నారు.
శ్రేయస్ అయ్యర్ తనకి వచ్చిన అవకాశాలను వృథా చేసుకున్నాడని అంటున్నారు. తనపై అపారమైన నమ్మకంతో కీలకమైన మెగా టోర్నీలో ఇన్ని అవకాశాలివ్వడం గొప్ప విషయమేనని అంటున్నారు. అయితే ఇప్పటివరకు రోహిత్, కోహ్లీ ఇద్దరిపైనే మ్యాచ్ లు నడుస్తున్నాయి. వారే సగం భారం మోసేస్తున్నారు. దీంతో శ్రేయస్ వచ్చేసరికి రన్ రేట్ పెంచడం అనే బాధ్యత పడుతోంది. దాంతో అనవసరమైన షాట్లకు వెళ్లి వికెట్లు పాడేసుకుంటున్నారని అంటున్నారు.
కానీ ఇంగ్లండ్ తో జరిగిన మ్యాచ్ లో మాత్రం జట్టు కష్టకాలంలో అలా అనవసరపు షాట్ కొట్టి అవుట్ కావడం కరెక్టు కాదని చెబుతున్నారు. అయినప్పటికి రిజర్వ్ ప్లేయర్లు ఉండి కూడా శ్రేయాస్ కి బోర్డు పెద్ద పీట వేస్తోంది. శుభ్ మన్ గిల్ కూడా ఇంకా జూలు విదల్చలేదు. నాకౌట్ మ్యాచ్ ల్లో తను చెలరేగి ఆడితే మాత్రం ఇండియాకి తిరుగుండదని అంటున్నారు.