PPF (Public Provident Fund) : పెట్టుబడికి భద్రత, పన్ను బెడదలేని నమ్మకమైన మదుపు పథకాల్లో పీపీఎఫ్ (పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్) ముందు వరుసలో ఉంది. ముఖ్యంగా ఉద్యోగ విరమణ లేదా 60 ఏళ్ల తర్వాతి ఆర్థిక అవసరాల గురించి ఆలోచించే వారికి ఇదో నమ్మకమైన పథకం. ప్రత్యేకించి.. 40 ఏళ్లు దాటిన వారంతా తప్పక ఆలోచించదగిన పథకమిది.
ఇదీ లెక్క..
ఈ పీపీఎఫ్ పథకంలో ఏటా రూ.500 నుంచి గరిష్టంగా లక్షన్నర రూపాయలు పెట్టుబడి పెట్టొచ్చు. లక్షన్నర పైబడి పెట్టుబడి పెడితే దానికి పన్ను కట్టాలి. ఏ జాతీయ బ్యాంకు లేదా పోస్టాఫీసులోనైనా అకౌంట్ ఓపెన్ చేయవచ్చు. ఈ పథకపు మెచ్యురిటీ పీరియడ్.. 15 సంవత్సరాలు. ఆ తర్వాత మీ డబ్బును వెనక్కి తీసుకోవచ్చు. ఆ తర్వాత కూడా అకౌంట్ను అలాగే కొనసాగించదలచుకుంటే.. మరో 5 ఏళ్లు పెంచుకోవచ్చు. ప్రస్తుతం ఈ పథకం కింద 7.71 శాతం వడ్డీ వస్తోంది. ఏటా ప్రభుత్వం ఈ వడ్డీని మార్చుతోంది. అయితే.. బ్యాంకుల కంటే ఇది ఖచ్చితంగా మంచి వడ్డీయే.
పీపీఎఫ్ అకౌంట్ తెరిచేటప్పుడే నామినీ పేరు ప్రస్తావించాలి. ఖాతాదారుడు మరణించినట్లయితే.. నామినీకి ఆ డబ్బులు వెళ్తాయి. పీపీఎఫ్ అకౌంట్ తెరిచి ఐదేళ్లయిన తర్వాత.. లోన్ అవసరమైతే.. తక్కువ వడ్డీకే మీరు కట్టిన మొత్తంలో నుంచి కొంత లోన్గా ఇస్తారు.
ఎంత కడితే ఎంత వస్తుంది?
మీరు పీపీఎఫ్ పథకంలో ఏటా రూ.1,50,000 పెట్టుబడిగా పెట్టగలిగితే.. ఇప్పుడున్న 7.1 శాతం వడ్డీ ప్రకారం.. 15 ఏళ్ల తర్వాత రూ.40,68,209 పొందొచ్చు. అంటే.. మీరు పెట్టిన రూ.22,50,000 పెట్టుబడికి వడ్డీగా రూ.18,18,209 తోడవుతుందన్నమాట.