Raghunandan Rao : దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్రెడ్డిపై హత్యాయత్నంపై దుబ్బాక ఎమ్మెల్యే, బీజేపీ నేత రఘునందన్ రావు స్పందించారు. కొత్త ప్రభాకర్రెడ్డిపై జరిగిన దాడిని రఘునందన్ రావు తీవ్రంగా ఖండించారు. అలాగే ఆయనపై దాడికి, తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు.
Raghunandan Rao : దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్రెడ్డిపై హత్యాయత్నంపై దుబ్బాక ఎమ్మెల్యే, బీజేపీ నేత రఘునందన్ రావు స్పందించారు. కొత్త ప్రభాకర్రెడ్డిపై జరిగిన దాడిని రఘునందన్ రావు తీవ్రంగా ఖండించారు. అలాగే ఆయనపై దాడికి, తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. అయినా సోషల్ మీడియాలో తనే ఆ దాడి చేయించానని వస్తున్న తప్పుడు ప్రచారంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి హింసాత్మక ఘటనలకు చోటులేదని వ్యాఖ్యానించారు. పోలీస్ కమీషనర్ శ్వేత చేసిన వ్యాఖ్యల వల్ల బీజేపీ కార్యకర్తల పై దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు.
స్వామి అనే బీజేపీ కార్యకర్తను కొందరు మఫ్టీ పోలీసులు తీసుకెళ్లారని, నవీన్ అనే మరో కార్యకర్తపై దాడి కూడా జరిగిందని రఘునందన్ చెప్పారు.తమ కార్యకర్తలపై జరిగే దాడికి పోలీసులు వెంటనే స్పందించాలని లేదంటే రేపు ఉదయం తాను కార్యాలయానికి వచ్చి రాతపూర్వక ఫిర్యాదు చేస్తానని ఆయన హెచ్చిరించారు.
పోలీస్ కమిషనర్ బీఆర్ఎస్ మంత్రులకు అనుగుణంగా పనిచేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ కార్యకర్తల ఇల్లు, దుకాణాలపై దాడులు జరుగుతుంటే, వారిని కొడుతుంటే పోలీసులు మౌనంగా చూస్తున్నారని ధ్వజమెత్తారు. అధికార పార్టీకి పోలీస్ కమీషనర్ వత్తాసు పలుకుతున్నారన్నారు. సిద్దిపేట సీపీపై వారం రోజుల క్రితం డీజీపీకి ఫిర్యాదు చేశామని తెలిపారు.
కొత్త ప్రభాకర్ రెడ్డి తనకు మంచి మిత్రుడని.. ఆయనను తాను పాలమూరు నుంచి నేరుగా ఆసుపత్రికి వెళ్లి పరామర్శిస్తానని చెప్పారు. నిందితుడు రాజు జై కాంగ్రెస్, జై మిరుదొడ్డి మండలం అని ఫేస్ బుక్లో స్టేటస్ పెట్టుకున్నారన్నారు. వీహెచ్తో దిగిన ఫోటోలు ఉన్నాయన్నారు. ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపి సీపీ పూర్తి వివరాలు వెల్లడించి ఉంటే బాగుండేదన్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో దిష్టిబొమ్మలు దగ్ధం చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.
తనకు దళితబంధు రాలేదనే ఆవేదనతో రాజు ఈ దాడికి పాల్పడినట్లు కొన్ని ప్రసార మాద్యమాల్లో వస్తోందన్నారు. కార్యకర్తలు అందరూ సంయమనం పాటించాలన్నారు. నిందితుడు రాజు మద్యం మత్తులో ఉన్నాడని, కుటుంబ సభ్యులతో కలహాలు ఉన్నాయని కూడా మీడియాలో వార్తలు వస్తున్నాయన్నారు. నిందితుడు రాజు బీజేపీ కండువా కప్పుకున్నట్లుగా ప్రచారం సాగుతోందని రఘునందన్ తెలిపారు.
కాగా, దాడి చేసిన రాజు అనే వ్యక్తి ఇటీవలి వరకు కాంగ్రెస్ పార్టీలో ఉండి, కొన్ని రోజుల క్రితం బీజేపీలో చేరినట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది.
కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడిని ఖండించిన కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డి
కొత్త ప్రభాకర్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నాన్ని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఖండించారు. ఇలాంటి దాడులకు ప్రజాస్వామ్యంలో తావు లేదన్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా దాడిని ఖండించారు. ఈ దాడిపై పారదర్శక విచారణ జరగాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఎప్పుడూ హింసను నమ్ముకోలేదన్నారు. దాడి చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేయాలన్నారు.