Duck Out: మీరు ఒకటిస్తే.. మేం రెండిస్తాం.. కోహ్లీకి డక్ తగిలిస్తారా..? దెబ్బకు దెబ్బ అంటున్న నెటిజన్లు.. ఇండియా-ఇంగ్లండ్ మధ్య జరిగిన మ్యాచ్ హోరాహోరీగా సాగుతుందని అనుకున్నారు. కానీ టీమ్ ఇండియా 229 పరుగులకే ఆలౌట్ కావడంతో.. ఇంగ్లాండ్ సులువుగా గెలుస్తుందని అంతా అనుకున్నారు. కానీ వాళ్లు మరింత ఘోరంగా ఆడి 100 పరుగుల తేడాతో ఓటమి పాలయ్యారు.
ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ డకౌట్ కావడంతో ఇంగ్లాండ్ కి చెందిన బార్మీ ఆర్మీ ట్రోలింగ్ చేసింది. ఇది ఇంగ్లండ్ క్రికెట్ కి సంబంధించిన అధికారిక ఫ్యాన్స్ గ్రూప్. నెట్టింట వీరు కొంచెం హుషారుగా ఉంటారు. అంతేకాదు వీరి జట్టుని ఎవరైనా విమర్శిస్తే, అందుకు తగిన సమాధానాలు ఇస్తుంటారు. కోహ్లీ డకౌట్ తో అలాంటి బార్మీ ఆర్మీ ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. దీంతో నదిలో తిరిగే రెండు బాతు బొమ్మలను వేసి, అందులో ఒకదానికి కోహ్లీ ఫొటోను అతికించి.. నెట్టింట వదిలారు. అంటే వారికెంత ఆనందమో చూడండి. కోహ్లీ అవుట్ అయ్యాడంటే మ్యాచ్ సగం గెలిచేసినట్టేనని అనుకున్నారు.
కానీ ఇండియన్ బౌలర్ల వంతు వచ్చింది. అంతే బూమ్రా బౌలింగ్ లో గోల్డెన్ డక్ కింద జో రూట్ అయిపోయాడు. ఆ తర్వాత బెన్ స్టోక్ సైతం సున్నాకే అవుట్ అయ్యాడు. దీంతో మన ఇండియన్ ఫ్యాన్స్ ఊరుకుంటారా? ఆ బార్మీ ఆర్మీ ఫ్యాన్స్ పెట్టిన ఫొటోనే వీరూ తీసుకున్నారు. అక్కడ రెండు బాతుల మీద ఇంగ్లండ్ బ్యాటర్ల ఫొటోలు అతికించి…మీరు ఒకటిస్తే, మేం రెండిస్తాం అని క్యాప్షన్లు రాసి పోస్ట్ చేశారు. దీంతో అదీ ఇదీ రెండు కూడా వైరల్ అయిపోయాయి.
దీంతో ప్రపంచ క్రికెట్ లో విరాట్ కోహ్లీ ప్రత్యర్థులను ఎంత వణికిస్తున్నాడో చూడమని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. కోహ్లీ అవుట్ అయితే వారికి చెప్పలేనంత సంతోషంగా ఉందని వ్యాఖ్యానిస్తున్నారు. పాకిస్తాన్, సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా ఏ జట్టు అయినా సరే, ముందు విరాట్ కోహ్లీ క్రీజులోకి రాగానే తనని అవుట్ చేయడానికే చూస్తారు. అక్కడ అభిమానులు కూడా అదే కోరుకుంటారు.
‘‘ఒరేయ్…ఇంకా కోహ్లీ ఉన్నాడ్రా .. తీయండ్రా బాబు వికెట్టు, తనుంటే ప్రమాదం’’అని ఆ దేశాభిమానులు తమ జట్లను ఉద్దేశించి అనడం సర్వసాధారణం. కోహ్లీ అవుట్ అయ్యాడంటే వారి ఆనందానికి అవధులు ఉండవన్నమాట. అంతలా కోహ్లీ అందరినీ భయపెట్టాడని అంటుంటారు.
ఒకప్పుడు సచిన్ టెండుల్కర్ రేంజ్ కూడా అలాగే ఉండేది. సచిన్ ఉన్నాడా? లేడా? అని అంతా అడిగేవారు. ఆ రోజుల్లో సచిన్ అవుట్ అయితే టీవీలు కట్టేసి జనం వెళ్లిపోయేవారు. అంతగా సచిన్ ప్రభావం చూపించేవాడు. ఇప్పుడదే సీన్ కోహ్లీ విషయంలో రిపీట్ అవుతుందని నెటిజన్లు గుర్తు చేస్తున్నారు.