Women Reservation Bill: శ్రమశక్తిలో సగానికి పైగా, జనాభాలో సగమున్న మహిళలకు ఎన్నికల్లో పోటీచేసేందుకు ఆయా రాజకీయ పార్టీలు సీట్లు మాటల్లో చెబుతున్నంతగా సీట్లు ఇవ్వటం లేదని.. శాసన సభ గణాంకాలను పరిశీలిస్తే మనకు అర్థమవుతోంది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికల్లో తెలంగాణ ప్రాంతం నుంచి ఎన్నికయ్యే 119 సీట్లలో.. 71 ఏళ్లపాటు.. 70 స్థానాల్లో మహిళలకు ఒక్కసారి కూడా పోటీచేసే అవకాశమే దక్కలేదంటే నమ్మాల్సిందే. ఇప్పటివరకు జరిగిన ఏ ఎన్నికలోనూ ఎంఐఎం ఒక్కసారీ మహిళకు ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశమే ఇవ్వలేదు. 1952 – 2018 మధ్యకాలంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 51 సెగ్మెంట్లకే మహిళలు ప్రాతినిథ్యం వహించారు.
తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన 2014 ఎన్నికల్లో కేవలం 8 మంది మహిళలే ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. వారిలో కాంగ్రెస్ నుంచి జె.గీతారెడ్డి, డీకే అరుణ ఉండగా, గులాబీ పార్టీ ఎమ్మెల్యేలుగా అజ్మీరా రేఖ, బొడిగె శోభ, గొంగిడి సునీత, కొండా సురేఖ, కోవా లక్ష్మి, పద్మాదేవేందర్రెడ్డి గెలుపొందారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఆరుగురికి పోటీ చేసేందుకు అవకాశం ఇచ్చింది.
ఇక.. 2018 ఎన్నికల నాటికి ఈ సంఖ్య ఆరుకే పరిమితమైంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున సీతక్క (అనసూయ), సబితారెడ్డి, బానోత్ హరిప్రియ గెలుపొందగా, టీఆర్ఎస్ నుంచి అజ్మీరా రేఖ, గొంగిడి సునీత, పద్మాదేవేందర్రెడ్డి విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ కేవలం నలుగురు మహిళకే పోటీకి అవకాశం ఇవ్వగా.. కాంగ్రెస్ 11 మందికి, బీజేపీ 14 మందికి బీఫారమ్లు ఇచ్చాయి. ఇక.. తెలుగుదేశం పోటీ చేసిన 13 స్థానాల్లో ఒక్కసీటు కేటాయించింది.
అలాగే.. చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, ఆదిలాబాద్, బోధ్, నిర్మల్, ముథోల్, బోధన్, నిజామాబాద్ అర్బన్, కోరుట్ల, జగిత్యాల, ధర్మపురి, రామగుండం, మంథని, పెద్దపల్లి, కరీంనగర్, వేములవాడ, మానకొండూరు, హుజూరాబాద్, హుస్నాబాద్, సిద్దిపేట, నారాయణఖేడ్, సంగారెడ్డి, పటాన్చెరు, దుబ్బాక, మల్కాజిగిరి, కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, ఉప్పల్, ఎల్బీనగర్, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, వికారాబాద్, తాండూరు, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, నాంపల్లి, కార్వాన్, గోషామహల్, చారి్మనార్, చాంద్రాయణగుట్ట, యాఖుత్పుర, కొడంగల్, నారాయణపేట్, మహబూబ్నగర్, జడ్చర్ల, నాగర్కర్నూల్, అచ్చంపేట, కొల్లాపూర్, నాగార్జునసాగర్, మిర్యాలగూడ, హుజూర్నగర్, సూర్యాపేట, మునుగోడు, జనగామ, స్టేషన్ ఘన్పూర్, పాలకుర్తి, వరంగల్ వెస్ట్, వర్దన్నపేట, భూపాలపల్లి, పినపాక, పాలేరు, మంథని, వైరా, సత్తుపల్లి, కొత్తగూడెం, అశ్వారావుపేట, బహదుర్పురా సెగ్మెంట్లలో ఒక్కసారీ మహిళా ఎమ్మెల్యే ఎన్నిక కాలేదు.
త్వరలో జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ పార్టీ ఎనిమిది మందిని బరిలో దించుతోంది.(సబితా ఇంద్రారెడ్డి- మహేశ్వరం, పద్మా దేవేందర్రెడ్డి- మెదక్, బానోత్ హరిప్రియ నాయక్- ఎల్లందు, గొంగిడి సునీత- ఆలేరు, కోవ లక్ష్మి- ఆసిఫాబాద్, జీ లాస్య నందిత- సికింద్రాబాద్ కంటోన్మెంట్, బడే నాగజ్యోతి- ములుగు, సునీతా లక్ష్మారెడ్డి- నర్సాపూర్) టికెట్లు కేటాయించింది. కాంగ్రెస్ ఇప్పటికి 11 మందికి (స్టేషన్ ఘనపూర్- సి. ఇందిర, గద్వాల- సరితా తిరపతయ్య, నారాయణపేట- పర్ణికా చిట్టెంరెడ్డి, వరంగల్ తూర్పు: కొండా సురేఖ, సనత్ నగర్ – డా. కోట నీలిమ, ములుగు- సీతక్క, కోదాడ- పద్మావతి, కంటోన్మెంట్- డా. జీవీ వెన్నెల, ఖైరతాబాద్- విజయా రెడ్డి, గోషామహల్ – మొగిలి సునీత, పాలకుర్తి- యశస్విని) సీట్లను కేటాయించింది. మిగిలిన పార్టీలపై స్పష్టత రావాల్సి ఉంది.
2029లో జరిగే సార్వత్రిక ఎన్నికల నుంచి మహిళా రిజర్వేషన్ బిల్లు అమలులోకి రానుంది. అది వస్తే తెలంగాణలోని 119 అసెంబ్లీ స్థానాల్లో 40 సీట్లు, 17 ఎంపీ సీట్లలో 5 నుంచి 6 సీట్లు మహిళలకు దక్కనున్నాయి.