Chandrababu Bail : మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు స్కిల్ స్కాం కేసు వ్యవహారంలో విచారణల పర్వం కొనసాగుతోంది. 50 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైల్ లో రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబు నాయుడి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని బెయిల్ మంజూరు చేయాలని హైకోర్టులో వేసిన పిటిష్లపై ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. మధ్యంతర బెయిల్ పై వాదనలు ముగియగా.. ఏపీ హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. మంగళవారం రెగ్యులర్ బెయిల్ పై వాదనలు వింటామని తెలిపింది. దీంతో కోర్టు ఏం తీర్పు వెలువరిస్తుందోనని టీడీపీ శ్రేణులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
క్వాష్ పిటిషన్లపై ఇప్పటికే సుప్రీంకోర్టులో విచారణ ముగియగా.. నవంబర్ 8వ తేదీన తీర్పు వెల్లడించనుంది. కాగా.. మధ్యంతర బెయిల్కు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ లోపు దసరా సెలవులకు ముందు బెయిల్ కోరుతూ చంద్రబాబు న్యాయవాదులు హైకోర్టులో మరోసారి పిటిషన్లు దాఖలు చేశారు. ఇది వాయిదా పడి వెకేషన్ బెంచ్కు వెళ్లినా..అక్కడి న్యాయమూర్తి నాట్ బిఫోర్ అంటూ అక్టోబర్ 30కి వాయిదా వేశారు.జస్టిస్ మల్లికార్జునరావు బెంచ్ ఈ పిటిషన్లపై విచారణ చేపట్టి.. మధ్యంతర బెయిల్ పిటిషన్ పై తీర్పును రిజర్వ్ చేశారు.