Train Derailment : విజయనగరం జిల్లాలో జరిగిన రైలు ప్రమాదం తర్వాత ట్రాక్ పునరుద్దరణ పనులను యుద్ధ ప్రాతిపదికన చేస్తున్నారు. ప్రతి నిమిషం ముఖ్యమే అన్నట్టుగా దూసుకుపోతున్నాయి రెస్క్యూ టీమ్స్.ఇప్పటికే ప్రమాదం జరిగి 15 గంటలు దాటడంతో వెంటనే ట్రాక్ను పునురుద్దరించి ట్రాక్పై మళ్లీ రైళ్ల పరుగులను ప్రారంభించాలని చూస్తోంది రైల్వే శాఖ. రెండు రైళ్లు ఢీకొనడం.. బోగీలు పక్కనే ఉన్న గూడ్స్ రైలుపై పడటంతో రెండు ట్రాక్లపై రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి.
ఇప్పటికే డ్యామేజ్ అయిన బోగీలు కాకుండా మిగిలిన బోగీలను అక్కడి నుంచి తరలించారు. ఇక డ్యామేజ్ అయిన బోగీలను ట్రాక్పై నుంచి తొలగించే పనులను ప్రారంభించారు. హేవీ డ్యూటీ క్రేన్లను రంగంలోకి దింపారు. బోగీలను పక్కకు తప్పించి ట్రాక్ను పునరుద్దరిస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే మొదట క్షతగాత్రులను బయటికి తీయడం.. ఆసుపత్రులకు పంపడంపై దృష్టి పెట్టిన రైల్వేశాఖ.. ఆ తర్వాత అసలు పనులను మొదలు పెట్టిందనే చెప్పాలి.
ఇప్పటికే 14 రైళ్లను రద్దు చేసిన రైల్వేశాఖ.. మరో ఐదు రైళ్ల దారిని మళ్లించింది. ప్రస్తుతం NDRF, ఏపీ స్టేట్ DRF సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. మరోవైపు రైల్వేశాఖ ట్రాక్పై పూర్తిగా దృష్టి పెట్టింది. సిగ్నలింగ్, హైటెన్షన్ వైర్, కొత్త ట్రాక్ను ఏర్పాటు చేసే పనులు జరుగుతున్నాయి. మరికొన్ని గంటల్లో ఈ ట్రాక్పై రైళ్లను పరిగెత్తిస్తామని చెబుతున్నారు రైల్వే అధికారులు.