Kerala IED Blast : కేరళ పేలుళ్లలో ఘటనలో మృతుల సంఖ్య మూడుకు చేరింది. ఆదివారం (అక్టోబర్ 30) మత ప్రార్థనలు జరుగుతున్న కన్వెన్షన్ సెంటర్లో వరుసగా మూడు పేలుళ్లు జరిగాయి. ఈ ఘటనలో ఒక మహిళ అక్కడికక్కడే చనిపోగా, మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రాత్రి చనిపోయారు. మొత్తం 52 మంది పైగా గాయపడ్డారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు.
క్రిస్టియన్ రిలీజియస్ గ్రూప్ జెనోవాస్ విట్నెసెస్ ఆధ్వర్యంలో ఎర్నాకుళం జిల్లా కలమస్సేరీలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. ఆదివారం ప్రార్థనలు చేస్తుండగా ఒకదాని తర్వాత ఒకటి మూడు బాంబులు పేలాయి. ఈ పేలుళ్లపై ఇప్పటికే NIA, NSG టీమ్స్ దర్యాప్తు ప్రారంభించాయి. నేషనల్ బాంబ్ డేటా సెంటర్ అధికారులు కూడా కేరళకు చేరుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
పేలుళ్ల ఘటనపై కేరళ గవర్నర్ ఆరీఫ్ మహమ్మద్, సీఎం విజయన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరోవైపు బాంబు పేలుళ్లకు తానే కారణమంటూ డొమినిక్ మార్టిన్ అనే వ్యక్తి త్రిసూర్ పోలీసుల ముందు లొంగిపోయాడు. తాను కూడా జెనోవాస్ విట్ నెసెస్ గ్రూప్కు చెందిన వాడినేనంటూ ప్రకటించాడు. దీనికి సంబంధించి లొంగిపోవడానికి ముందు ఓ వీడియో మెసేజ్ రిలీజ్ చేశాడు. తమ చర్చిలో యువత మైండ్ను పాడు చేస్తున్నారని.. ఇది దేశానికి చాలా ప్రమాదమన్నారు. మారాలని ఎంతో చెప్పి చూశానని.. వినకపోవడంతో పేలుళ్లు జరిపానంటూ తెలిపాడు.
అయితే డొమినిక్ను పూర్తిగా దర్యాప్తు చేసిన తర్వాతే అసలు విషయాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు చెబుతున్నారు. ఆయిల్ కంటైనర్ పక్కన ఐఈడీని పేల్చడంతో ప్రమాద తీవ్రత మరింత పెరిగినట్టు గుర్తించారు పోలీసులు. మరోవైపు కేరళ ప్రభుత్వం 20 మంది సభ్యులతో కూడిన ప్రత్యేక టీమ్ను దర్యాప్తుకు కోసం ఏర్పాటు చేసింది. అయితే IED ఎక్కడి నుంచి వచ్చింది? ఉగ్రకోణం ఏమైనా ఉందా? అన్న కోణంలో కూడా విచారణ జరుపుతున్నట్టు అధికారులు తెలిపారు.