BJP : తెలంగాణలో బీజేపీ – జనసేన పొత్తు కుదిరింది. సీట్ల పంపకాలపై ఓవైపు చర్చలు జరుగుతున్నాయి. మరోవైపు జనసేనకు కేటాయించే నియోజకవర్గాలపై రగడ మొదలైంది. హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయం ముందు కూకట్పల్లికి చెందిన నాయకులు నిరసన తెలిపారు. కూకట్పల్లి అసెంబ్లీ టికెట్ను జనసేనకు ఇవ్వొద్దని డిమాండ్ చేశారు. జనసేనకు ఆ స్థానాన్ని కేటాయించి తమ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయొద్దన్నారు. కూకట్పల్లి స్థానాన్ని జనసేనకు కేటాయించడమంటే బీఆర్ఎస్ గెలిపించడమేనని కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేశారు.
మరోవైపు ఢిల్లీకి వెళ్తున్నారు తెలంగాణ బీజేపీ నేతలు. 3వ జాబితాపై కసరత్తు చేస్తున్ననేతలు.. అక్కడి పెద్దలతో క్యాండిడేట్స్ ఎంపికపై చర్చించనున్నారు. బుధవారం బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ ఉండే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. చర్చల అనంతరం నవంబర్ మొదటి వారంలో ఈ జాబితాపై ప్రకటన చేసే అవకాశముంది.
ఇక జనసేనకు సీట్ల కేటాయింపుపై చర్చలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై ఢిల్లీలో మంతనాలు జరగనున్నాయి. ఇరు పార్టీల మధ్య పొత్తు ఖరారైనప్పటికీ.. సీట్ల సర్దుబాబుపై ఇంకా ఓ కొలిక్కిరాకపోవంతో ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ అంశంపై కూడా హైకమాండ్ పెద్దలతో చర్చించనున్నారు తెలంగాణ కమలనాథులు.
అలాగే మేనిఫెస్టో అంశం కూడా చర్చించే అవకాశమున్నట్టుగా సమాచారం. ఇక ఇటీవలే పలువురు పార్టీ నేతలు కాంగ్రెస్, బీజేపీలోకి జంప్ అయిన నేపథ్యంలో పెరుగుతున్న అసంతృప్తులపై ఫోకస్ పెట్టింది అధిష్టానం. ఈ నేపథ్యంలో అసంతృప్తులపై ఆరా తీయనుంది హైకమాండ్.