వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా టీమ్ ఇండియా గెలిచిన ప్రతి మ్యాచ్ తో ఏదొక రికార్డులను మన క్రికెటర్లు తిరగరాస్తున్నారు. లేదా బ్రేక్ చేస్తున్నారు. ఇప్పుడు ఇంగ్లండ్ తో జరిగిన మ్యాచ్ లో కూడా పలు రికార్డులు చెరిగిపోయాయి. కొత్తవి నమోదయ్యాయి. అవేమిటో చూద్దాం.
ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్ లో 18 వేల పరుగులు పూర్తి చేసిన అయిదో భారత బాట్స్ మెన్ అయ్యాడు. అంటే 18వేల పరుగుల క్లబ్ లో చేరాడు. తనకన్నా ముందు భారత బ్యాట్స్ మెన్ ఎవరని అంటే…
సచిన్ (34,357), కొహ్లీ (26,121), ద్రవిడ్ (24,208), గంగూలీ (18, 575) ఉన్నారు.
అయితే రోహిత్ శర్మ 52 టెస్టుల్లో 3,677, 257 వన్డేలు ఆడి 10,510, 148 టీ 20లంలో 3,853 పరుగులు సాధించాడు. ఓవరాల్ గా 18040 పరుగులు చేశాడు.
అంతేకాదు అన్ని ఫార్మాట్లలో కలిపి భారత జట్టు కెప్టెన్ గా రోహిత్ కి ఇది వందో మ్యాచ్. ఈ ఘనత సాధించిన ఏడో కెప్టెన్ గా రోహిత్ నిలిచాడు. అలాగే 2023 ఏడాది జరిగిన వన్డేల్లో 1000 పరుగులు పూర్తి చేసిన మూడో బ్యాట్స్ మెన్ గా రోహిత్ నిలిచాడు.
బౌలింగ్ విషయానికి వస్తే… మహ్మద్ షమీ నాలుగు వికెట్ల ప్రదర్శనలతో తనొక రికార్డ్ సమం చేశాడు. వరల్డ్ కప్ లో అత్యధిక సార్లు ఈ ఘనత సాధించిన బౌలర్ గా ఉన్న స్టార్క్ (6)ని సమం చేశాడు. స్టార్క్ 24 ఇన్నింగ్స్ లో ఈ ఫీట్ చేస్తే, షమీకి 13 ఇన్నింగ్స్ మాత్రమే పట్టడం విశేషం.
ప్రపంచకప్ చరిత్రలో భారత్ కి ఇది 59వ విజయం. టోర్నీ చరిత్రలో అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా ఆస్ట్రేలియా (73) మొదటి స్థానంలో ఉండగా టీమ్ ఇండియా…రెండో స్థానంలో ఉంది. ఇకపోతే 2011 నుంచి చూస్తే ఇప్పటికి ఇండియా 31 ప్రపంచకప్ మ్యాచ్ లు ఆడింది. అందులో భారత్ 27 విజయాలు సాధించింది. నాలుగు మ్యాచ్ ల్లో మాత్రమే ఓటమి పాలయ్యింది. అవికూడా కీలకమ్యాచ్ ల్లో అంటే సెమీస్ లాంటి చోట ఓడిపోవడంతో..అసలు ప్రతిభ మసకబారిందని గుర్తు చేస్తున్నారు.
ఈ మ్యాచ్లో మరో అరుదైన ఘటన చోటుచేసుకుంది. రెండు జట్లలోనూ వన్డౌన్ బ్యాటర్లు డకౌట్ అయ్యారు. వన్డే ప్రపంచకప్ 48 ఏళ్ల చరిత్రలో ఇలా జరగడం ఇదే తొలిసారి. ఇంగ్లండ్ లో రూట్ గోల్డెన్ డక్ కాగా.. ఇండియాలో 9 బాల్స్ ఆడిన విరాట్ కోహ్లి సున్నాకే వెనుదిరిగాడు.
ప్రపంచకప్ లో నాలుగు మ్యాచ్ లు వరుసగా ఓడిపోవడం ఇంగ్లండ్ కి ఇదే తొలిసారి. అంతేకాదు డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలో దిగిన ఇంగ్లండ్…లీగ్ దశలోనే అయిదు మ్యాచ్ ల్లో ఓడిపోయి ఒక చెత్త రికార్డ్ కూడా నమోదు చేసింది.