Revanth Tweet : తెలంగాణ ఎన్నికల ప్రచారంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. ఈ తరుణంలో రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం గురించి ట్వీట్ చేసారు. ఎవరినైనా నమ్మితే తెలంగాణ ప్రజలు గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారని ఆయన తెలిపారు. నయవంచన చేసినవాడికి తగిన గుణపాఠం చెప్పాలని అందుకోసం తాను యుద్ధం చేస్తునట్టు తెలిపారు. ఈ యుద్ధంలో జనమే తన సైన్యం అని.. వారి అభిమానమే ఆయుధమని పేర్కొన్నారు. తెలంగాణ గెలుపు కోసం తన జీవితాన్ని అంకితమిస్తానని అన్నారు.
తెలంగాణ గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నారు. తెలంగాణ కోసం తన జీవితాన్ని పణంగా పెట్టి అమరుడైన గద్దర్ కుమార్తె వెన్నెలకు సికింద్రాబాద్ కంటోన్మెంట్ సీటు కేటాయించడంతో తెలంగాణ ఉద్యమకారులు హర్షం వ్యక్తం చేసారు. ఈ సందర్భంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని వెన్నెల మర్యాదపూర్వకంగా కలిశారు. కంటోన్మెంట్ సీటు తనకి కేటాయించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
కంటోన్మెంట్ ప్రజలు తనని ఆదరిస్తారని ఆమె అన్నారు. కంటోన్మెంట్ లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డిని ప్రచారానికి రావాలని ఆహ్వానించినట్టు ఈ సందర్బంగా ఆమె తెలిపారు. తెలంగాణాలో గెలిచేది కాంగ్రెస్ పార్టీ అని ఆమె ఈ సందర్భంగా అన్నారు. కాగా వెన్నెల కాంగ్రెస్లో చేరకముందే ఆమెకు ఆ పార్టీ టికెట్ కేటాయించడం గమనార్హం.