Telangana Elections 2023 : తెలంగాణ ఎన్నికల వేళ కర్ణాటకపై నేతల సవాళ్లు ప్రతిసవాళ్లతో పొలిటికల్ హీట్ మరింత కాకరేపుతోంది. కర్ణాటకలో ఎన్నికల హామీలను అమలు చేయాలేదని ఆరోపిస్తూ గులాబీ నేతలు చేస్తున్న ప్రచారానికి కౌంటర్ ఇస్తున్నారు హస్తం శ్రేణులు. కాంగ్రెస్ను నమ్మవద్దని.. వారి మోసం తెలియాలంటే కర్ణాటక వెళ్లి అక్కడి రైతులతో మాట్లాడేందుకు సిద్ధమా అని మంత్రి కేటీఆర్ విసిరిన సవాల్కు ధీటుగా డీకే శివకుమార్ సహా పలువురు కాంగ్రెస్ నేతలు ప్రతిసవాళ్లు విసురుతున్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన 5 హామీలను నెరవేర్చామని డీకే శివకుమార్ చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా కేసీఆర్ గత హామీలపై నిలదీశారు.
మరోవైపు బీఆర్ఎస్ చేస్తున్న ప్రచారం అవాస్తమంటున్నారు కర్ణాటక రైతులు. 300 రూపాయలు ఇస్తామంటే తెలంగాణకు వచ్చామని.. ఏం కార్యక్రమమో కూడా తమకి తెలియదని కర్ణాటక నుంచి వచ్చిన రైతులు తేల్చి చెప్పారు. దీంతో ఇదంతా ఎన్నికల కోసం గులాబీ నేతలు ఆడుతున్న నాటకమని కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. కావాలనే తమపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్నకొద్దీ హోరాహోరీగా ప్రచారం సాగుతోంది. ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ల మధ్య త్రిముఖ పోటీ నెలకొనడంతో నేతలు ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. మాటల తూటాలు ఎక్కుపెడుతూ ప్రచారాన్ని సాగిస్తున్న నేపథ్యంలో కర్ణాటకలో ఎన్నికల హామీలపై సవాళ్లు, ప్రతిసవాళ్లతో రాజకీయ రగడ మరింత ముదురుతోంది.