Mukesh Ambani : రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీకి మరో బెదిరింపు ఈమెయిల్ వచ్చింది. ఈసారి నిందితులు ఏకంగా 200 కోట్ల రూపాయలు డిమాండ్ చేశారు. అడిగినంత డబ్బు ఇవ్వకపోతే ముఖేష్ అంబానీని చంపేస్తామని వార్నింగ్ ఇచ్చారు. శనివారం 20 కోట్లు డిమాండ్ చేస్తూ మెయిల్ పంపిన నిందితులు.. దానికి స్పందించకపోవడంతో 200 కోట్లు డిమాండ్ చేస్తూ అదే అకౌంట్ నుంచి మరో ఈమెయిల్ పంపారు. ముఖేష్ అంబానీని కాల్చి చంపుతామని మెయిల్లో బెదిరించిన నిందితులు.. తమ దగ్గర దేశంలోనే బెస్ట్ షూటర్లు ఉన్నారని పేర్కొన్నారు. అంబానీ సెక్యూరిటీ ఇన్ఛార్జ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. మెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు పెట్టారు? అనే వివరాల కోసం దర్యాప్తు చేస్తున్నారు.
రిలయన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఆస్పత్రికి బెదిరింపు ఫోన్ కాల్ వచ్చిన కొద్దిరోజుల్లోనే.. ముఖేష్ అంబానీని చంపేస్తామని హెచ్చరిస్తూ రెండు రోజుల్లో రెండు మెయిల్ రావడం కలకలం రేపుతోంది. ఈ రెండు ఘటనలతో ముంబై పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఆయన నివాసానికి అదనపు భద్రతను కల్పించారు.
ఇప్పుడే కాదు.. గతంలోనూ ముఖేష్ అంబానీకి బెదిరింపులు వచ్చాయి. 2021లో ఆయన నివాసం అంటాలియాకు అత్యంత సమీపంలో కారును పార్క్ చేసిన ఉదంతం అనేక మలుపులు తిరిగింది. ఆ కారులో 20 జిలెటిన్ స్టిక్స్ లభించాయి. ఇది కేవలం గ్లింప్సెస్ మాత్రమే అనే బెదిరింపు లేఖనూ పోలీసులు ఆ కారు నుంచి స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు తాజాగా ఆయనకు మరో రెండు బెదిరింపు మెయిల్స్ రావడం ఆందోళన కలిగిస్తోంది.