East Godavari : హర్యానా రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్ కు మద్యాన్ని అక్రమంగా రవాణా చేస్తున్న ఆరుగురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు తూర్పుగోదావరి జిల్లా స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో రాజమహేంద్రవరం సౌత్ పోలీసులు తెలిపారు. 63 అట్టపెట్టెల్లో అక్రమంగా తరలిస్తున్న 774 మద్యం బాటిల్స్ను వారి నుంచి స్వాధీనం చేసుకుని, సీజ్ చేసినట్లు తెలిపారు.
రాజమండ్రి సబ్ పోలీస్ స్టేషన్లో అడిషనల్ ఎస్పీ సోమశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. ముందస్తు సమాచారం మేరకు జిల్లా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో డిస్ట్రిక్ట్ స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ ఆఫీసర్ పిట్టా సోమశేఖర్ ఆదేశాలు మేరకు రాజమహేంద్రవరం సౌత్ ఇన్స్పెక్టర్ పి.హనుశ్రీ, ఎస్సై వి.అప్పారావు, ఎస్సై పి.చిట్టి బాబు సిబ్బందితో దాడులు నిర్వహించారని తెలిపారు. దాడుల్లో భాగంగా రాజానగరం మండలము దివాన్ చెరువులోని ఆటోనగర్ సెంటర్ వెయిట్ మెషిన్ వెనుక ఉన్న ఖాళీ స్థలంలోని లారీలో ఉన్న హర్యానాకు చెందిన మద్యం సీసాలను ఆరుగురు వ్యక్తులు విక్రయిస్తుండగా పట్టుకున్నట్లు తెలిపారు. మద్యం విలువ సుమారు 3 లక్షల యాభై వేలు ఉంటుందని తెలిపారు.
అరెస్టయిన వారిలో బొమ్మూరుకి చెందిన శెట్టి నాగేశ్వరరావు, తులుగు రమేష్,పిసిని సురేష్, ఉండ్రాజవరంకి చెందిన మాస రవి, రాజమండ్రికి చెందిన ఏడాకుల నాగ దుర్గ ప్రసాద్, దేవరపల్లికి చెందిన చెల్లికి చిన్నబాబు ఉన్నారు. కొంత కాలంగా హర్యానా నుంచి అక్రమంగా మద్యం సీసాలును కొనుగోలు చేసి.. ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా వాటిని అధిక ధరలకు విక్రయిస్తున్నారని ఎన్ ఫోర్స్ మెంట్ ఆఫీసర్ పిట్టా సోమశేఖర్ తెలిపారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు. వీరికి మద్యం బాటిల్స్ సరఫరా చేసే వికాస్ వర్మను అరెస్ట్ చేయాల్సి ఉందని, అతని కోసం గాలిస్తున్నట్లు వెల్లడించారు.