Cyber Towers : హైదరాబాద్ లో ఉన్న హైటెక్ సిటీని అభివృద్ధి చేసింది చంద్రబాబే అన్న విషయం తెలిసిందే. హైటెక్ సిటీలో సైబర్ టవర్ నిర్మించి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా.. మాజీ సీఎం టీడీపీ అధినేత చంద్రబాబుకు కృతజ్ఞతగా.. భారీ ఎత్తున గ్రాటిట్యూడ్ కన్సర్ట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఐటీ ఉద్యోగులు. గచ్చిబౌలి బాలయోగి స్టేడియంలో ఆదివారం సాయత్రం 4 గంటల నుంచి 9 గంటల వరకూ సభ జరగనుండగా.. పోలీసులు షరతులతో కూడిన అనుమతినిచ్చారు. లక్ష మందితో జరిగే ఈ సభకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి దేశ, విదేశాల నుంచి చంద్రబాబు అభిమానులు తరలిరానున్నట్లు తెలుస్తోంది.
స్కిల్ స్కాం కేసులో చంద్రబాబు జైలులో ఉండటంతో ఈ సభకు ప్రాధాన్యత ఏర్పడింది. రాజమండ్రి జైలులో 50 రోజులకు పైగా చంద్రబాబు జైలు జీవితాన్ని అనుభవిస్తున్నారు. ఒక్క స్కిల్ స్కాం కేసే కాకుండా పలు రకాల కేసులను చంద్రబాబు ఎదుర్కొంటున్నారు. వీటికి సంబంధించిన బెయిల్ పిటిషన్లు, విచారణ పర్వం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే ఆయన అవినీతిపరుడు కాదని.. అభివృద్ధికి బాటలు వేసిన నేత అని తెలిపే క్రమంలో భారీ ఎత్తున కృతజ్ఞత సభను నిర్వహిస్తున్నట్టు సమాచారం.
ఇక చంద్రబాబు అరెస్ట్ను ఖండిస్తూ నిరసనలు కొనసాగుతున్నాయి. త్వరలో ఏపీలో ఎన్నికల నేపథ్యంలో జగన్ను ఎదుర్కొనే దిశగా ప్రచారం సాగిస్తున్నారు టీడీపీ శ్రేణులు. వైసీపీ కుట్ర రాజకీయాల్లో భాగంగానే చంద్రబాబును జైలుకు పంపారన్న అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు.