Champapet Crime : చంపాపేట్ యువతి స్వప్న హత్య.. హైదరాబాద్లో ప్రకంపనలు సృష్టించింది. ఎట్టకేలకు ఈ మర్డర్ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త ప్రేమ్ కుమారే హత్య చేశాడని పోలీసులు భావిస్తున్నారు. ఘటనాస్థలంలో దొరికిన కత్తిపై ప్రేమ్ కుమార్ ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ అయ్యాయని స్పష్టం చేశారు. ప్రేమ్కుమార్ ఇంటికి వెళ్లేసరికి.. స్వప్న వేరేవారితో సన్నిహితంగా ఉండటం చూసి.. కోపంతో చంపేశాడని అనుమానిస్తున్నారు. అప్పటికే అక్కడ ఉన్న మరో ఇద్దరు యువకులు స్వప్న హత్య జరగగానే పారిపోయారు. దీంతో వారి పాత్రపై పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. స్వప్నని పొడిచి ప్రేమ్కుమార్ భవనంపై నుంచి దూకేసి ఉంటాడని.. అతను కోలుకుంటేనే మరిన్ని విషయాలు బయటకొస్తాయని పోలీసులు చెబుతున్నారు.
మహబూబ్నగర్ జిల్లా కొత్తపేటకు చెందిన స్వప్న.. తల్లిదండ్రులతో కలిసి హైదరాబాద్లో ఉంటోంది. ఇదే క్రమంలో 8 నెలల క్రితం స్వప్న.. హన్మంత్ అనే యువకుడితో కలిసి చంపాపేటలోని రాజిరెడ్డినగర్లోని ఓ ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటున్నారు. అయితే నెలరోజుల క్రితం.. ప్రేమ్కుమార్ అనే మరో యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. మధ్యలో ఈ హన్మంత్ ఎవరు?.. ఎందుకు వీరిద్దరు గది అద్దెకు తీసుకుని ఉన్నారన్న దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. స్వప్నకి ప్రేమ్ కుమార్కు హన్మంతు మధ్యవర్తిత్వం వహించాడని చెప్తున్నారు. ప్రేమ్కుమార్ కోలుకుంటేనే తప్ప అసలు వాస్తవాలు బయటకొచ్చే అవకాశముంది.