Black Hole Tragedy : బ్రిటీషు వారు భారతదేశంలో ఎంత క్రూరంగా పరిపాలించేవారో బడి పుస్తకాలలో మీరు చదివే ఉంటారు. కానీ బ్రిటీష్ దేశంలో స్కూలు పిల్లలకు భారతీయులు ఎంతో క్రూరంగా ఉంటారని వివరిస్తూ ఒక ఉదాహరణ చెబుతారు. అదే బ్లాక్ హోల్ ట్రాజెడీ ఆఫ్ కోల్కతా(Black Hole of Calcutta).
Black Hole Tragedy : బ్రిటీషు వారు భారతదేశంలో ఎంత క్రూరంగా పరిపాలించేవారో బడి పుస్తకాలలో మీరు చదివే ఉంటారు. కానీ బ్రిటీష్ దేశంలో స్కూలు పిల్లలకు భారతీయులు ఎంతో క్రూరంగా ఉంటారని వివరిస్తూ ఒక ఉదాహరణ చెబుతారు. అదే బ్లాక్ హోల్ ట్రాజెడీ ఆఫ్ కోల్కతా(Black Hole of Calcutta).
కేవలం రాజుగారికి నిద్రాభంగం కలగకూడదని భావించి యుద్ధఖైదీలైన 146 మంది బ్రిటీష్ సైనికులని ఒకే జైలు గదిలో బంధించారు. రాత్రంతా ఆ సైనికులకి ఆ చిన్న గదిలో ఊపిరాడలేదు. ఉదయం జైలు గది తెరిచి చూసే సరికి 23 మంది మాత్రమే ప్రాణాలతో మిగిలారు. ఈ ఘటన 1756 సంవత్సరంలో ప్రస్తుత బెంగాల్ రాష్ట్రంలో జరిగింది.
1700 సంవత్సరంలో బ్రిటీషర్లు అప్పటి భారతదేశ మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు అనుమతితో బెంగాల్ రాజ్యంలో హుగ్లీ నదీతీరాన ఒక కోట కట్టుకున్నారు. దాని పేరు ఫోర్ట్ విలియమ్స్. కాలక్రమేణ బెంగాల్ ఒక స్వతంత్ర రాజ్యంగా మారింది. 1756లో బెంగాల్ రాజ్యానికి రాజుగా నవాబ్ సిరాజుద్దౌలా ఉన్నారు. ఆ సమయం వరకు బ్రిటీషర్లు ఆ కోటను కేవలం వ్యాపార కార్యకలాపాల కోసమే వినియోగించేవారు. కానీ 1756లో బ్రిటీషర్లు క్రమంగా తమ దేశం నుంచి ఆయుధాలతోపాటు సైనికులని కూడా ఎక్కువ సంఖ్యలో తీసుకురావడం మొదలుపెట్టారు. ఈ సమాచారం విన్న బెంగాల్ నవాబ్ బ్రిటీషర్లను పిలిచి వారి సైన్యాన్ని వెనక్కి పంపించమని, కోటను కేవలం వ్యాపార కార్యకలాపాల కోసమే వినియోగించాలని ఆదేశించాడు.
కానీ బ్రిటీషర్లు రాజుగారి ఆజ్ఞను పెడచెవిన పెట్టి తమ సైన్య శక్తి పెంచుకోవాలని ఇంగ్లాండ్ నుంచి మరింత మంది సైనికులను సముద్ర మార్గాన తీసుకువచ్చారు. ఇది తెలిసిన నవాబ్ సిరాజుద్దౌలా తన సైన్యాన్ని తీసుకొని జూన్ 19, 1756న ఫోర్ట్ విలియమ్స్ మీద దాడి చేశాడు. బెంగాల్ సైన్యం ముందు బ్రిటీష్ సైన్యం చాలా చిన్నది. యుద్ధం మొదలవ్వక ముందే బ్రిటీష్ గవర్నర్ జాన్ డ్రిక్, చాలా మంది బ్రిటీష్ సైనికులను తీసుకొని సముద్ర ఒడ్డున నిలబడి ఉన్న తమ నౌకలలో అక్కడి నుంచి పారిపోయారు. అయినా కోట లోపల బ్రిటీష్ కమాండర్ జాన్ హాల్వెల్ కేవలం 200 మంది సైనికులతో నవాబ్ సైనికులను ఎదుర్కొన్నాడు. ఆ యుద్ధం 24 గంటలపాటు సాగింది.
నవబ్ సైనికులు కోటలోపల విధ్వంసం సృష్టించారు. యుద్ధం ముగిసాక నవాబ్ సైన్యం కోటను ఆక్రమించుకుంది. కోట లోపల ఉన్న 146 మంది బ్రిటీష్ వారిని బంధించారు. ఆ 146 మందిలో సైనికులతో పాటు మహిళలు, పిల్లలు కూడా ఉన్నారు. వారందరినీ ఒక హాలులో ఉంచారు. నవాబ్ తన సైన్యంతో పాటు బందీలందరికీ మర్యాదపూర్వకంగా భోజనం ఏర్పాటు చేయించాడు.
భోజనాల తరువాత నవాబ్ బ్రిటీష్ సైన్య కమాండర్ని పిలిచి తోటలో మాట్లాడుతుండగా.. ఒక బ్రిటీష్ సైనికుడు తప్పతాగి తుపాకీతో ఒక నవాబ్ సైనికుడిని కాల్చి చంపాడు. ఇది తెలిసిన నవాబ్ వెంటనే అక్కడికి చేరుకున్నాడు. ఒక సభ ఏర్పాటు చేసి బ్రిటీష్ కమాండర్ని ఇలా ప్రశ్నించాడు. “మేము యుద్ధ ఖైదీలైన మీతో ఎంతో మర్యాదగా ప్రవర్తించాము. దానికి బదులుగా మీ సైనికుడు వ్యవహరించిన తీరు చూశారు కదా.. మరి మీరు ఇలాంటి సమయంలో ఏ శిక్ష విధిస్తారు” అని అడిగాడు. దానికి సమాధానిమిస్తూ.. “వారిని చీకటి కారగారంలో బంధించాలి” అని అన్నాడు.
ఆ సమయంలో నవాబ్ చాలా కోపంగా ఉన్నాడు. అప్పటికే రాత్రి కావడంతో ఆయన ఉదయం వరకు అందరినీ చీకటి కారగారంలో బంధించండి అని ఆదేశించి నిద్రపోవడానికి వెళ్లిపోయాడు. ఆ కోటలో ఒక్క జైలు గదిలో మాత్రమే చీకటిగా ఉంది. ఆ గది 18 అడుగుల పొడవు, 14 అడుగులు వెడల్పు ఉంది. నవాబ్ సైనికులు రాజుగారి ఆజ్ఞ కావడంతో ఆ 146 మంది బ్రిటీషర్లని ఆ ఒక్క గదిలోనే బంధించారు.
ఆ చీకటి గది నిర్మాణం చేసేటప్పుడు బ్రిటీషర్లకి అది వారి సమాధి అవుతుందని తెలియదు. ఎందుకంటే 146 మందిని ఒక చిన్న గది అది కూడా ఒక్క కిటికీ మాత్రమే ఉండడంతో అక్కడ అంతమందికి ఊపిరి తీసుకునేందుకు గాలిసరిపోలేదు.
అర్ధరాత్రి దాటేసరికి చాలా మంది స్పృహ కోల్పోయి పడిపోతున్నప్పుడు బ్రిటీష్ కమాండర్.. నవాబ్ సైనికులని గది తెరవమని ప్రాధేయపడ్డాడు. కొంత మందినైనా పక్క గదిలోకి మార్చాలని సూచించాడు. కానీ నవాబ్ సైనికులకు వారి పరిస్థితిపై దయ కలిగినా రాజు గారి ఆదేశాన్ని దాటి అలా చేయలేకపోయారు. పోనీ రాజుగారిని విషయం వివరించాలంటే.. ఆయన నిద్రపోతున్నారు. ఆయనను నిద్ర లేపడానికి భయంతో ఎవరూ ముందుకు రాలేదు.
అలా ఉదయం 6 గంటలకు నవాబ్ నిద్రలేచారు. వెంటనే సైనికులు జైలు గదిలో పరిస్థితిని ఆయనకు వివరించారు. నవాబ్ వారందరినీ బయటికి తీయమని ఆదేశించారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. 146 మందిలో 123 మంది ఊపిరాడక చనిపోయారు. ఈ విషాద సంఘటననే “బ్లాక్ హోల్ ఆఫ్ కలకత్తా” అని అంటారు. జరిగిన విషాదానికి బాధపడ్డ నవాబ్ మిగిలిన 23 మందిని మర్యాద పూర్వకంగా వారి దేశానికి పంపించేశాడు.
ఈ సంఘటన గురించి తెలిసిన బ్రిటీష్ ప్రభుత్వం పగతో రగిలిపోయింది. ఆ తరువాత నవాబ్ సిరాజుద్దౌలాను ‘ప్లాసీ యుద్ధం’లో మోసపూరితంగా ఓడించి తన ప్రతీకారం తీర్చుకుంది. కాలక్రమంలో భారతదేశాన్ని కైవసం చేసుకుంది. ఒక విధంగా చెప్పాలంటే బ్రిటీషర్లు భారతదేశాన్ని ఆక్రమించుకోవడానికి “బ్లాక్ హోల్ ఆఫ్ కలకత్తా” విషాద ఘటన ఒక పునాది లాంటిది.