Wardhannapet : వర్ధన్నపేట నియోజకవర్గంలో అన్ని వర్గాల ప్రజలను ఇబ్బందులకు గురిచేసిన ఘనత స్థానిక శాసనసభ్యుడు ఆరూరి రమేష్కే దక్కుతుందని నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి కేఆర్ నాగరాజు పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం కేఆర్ నాగరాజుకు వర్ధన్నపేట అసెంబ్లీ టికెట్ కేటాయించింది. ఈ సందర్భంగా నాగరాజు తన అనుచరులతో వరంగల్ శ్రీభద్రకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
వర్ధన్నపేట నియోజకవర్గ ప్రజలు తనని ఎంతో ఆదరిస్తున్నారని తెలిపారు. ముఖ్యంగా రైతులు, యువత, విద్యార్థులందరూ ప్రేమతో పలకరిస్తూ తనకి ఓటు వేస్తానని హామీ ఇస్తున్నారని చెప్పారు. ప్రస్తుత వర్ధన్నపేట శాసనసభ్యుడు ఆరూరి రమేష్ చేయని కబ్జాలు లేవని ఆరోపించారు. అన్యాయంగా రైతులపై, నాయకులపై ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టించి జైలుకు పంపుతున్నారని ఆయన వాపోయారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల్లో విశ్వసనీయత కోల్పోయిందని ఆయన తెలిపారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని అన్నారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఆశీస్సులు తనకు ఉన్నాయని తెలిపారు. ప్రజల దీవెనలతో వర్ధన్నపేటలో కాంగ్రెస్ జెండా ఎగరవేస్తానని కేఆర్ నాగరాజు అన్నారు.