Warangal West : బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి దాస్యం వినయ్ భాస్కర్ స్క్రిప్ట్తోనే కొంతమంది తనపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని వరంగల్ వెస్ట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నాయిని రాజేందర్ రెడ్డి ఆరోపించారు.శుక్రవారం వినయ్ భాస్కర్ నిర్వహించిన మీడియా సమావేశంలో నాయిని రాజేందర్ రెడ్డికి సవాల్ విసిరారు.ఆ సవాల్ ని స్వీకరించిన రాజేందర్ రెడ్డి శనివారం ఉదయం 8 గంటలకు భద్రకాళీ ఆలయానికి కుటుంబ సమేతంగా విచ్చేశారు.
ఈ సందర్భంగా ఆయన వినయ్ భాస్కర్పై ఘాటైన విమర్శలు చేశారు. ఆయన మాట్లాడుతూ సవాల్ విసిరిన వినయ్ భాస్కర్ ఎందుకు రాలేదని ప్రశ్నించారు. వినయ్ భాస్కర్ స్క్రిప్ట్తోనే తనపై బురద జల్లుతున్నారని మండిపడ్డారు. తాను భూకబ్జాలు చేసినట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని స్పష్టం చేశారు. నాయిని రాజేందర్ రెడ్డి ఎక్కడ గెలుస్తాడో అని వాళ్లు భయపడుతున్నారని ఎద్దేవా చేశారు.
నిజాలు మాట్లాడితే వారికి చనిపోయే శాపం ఉందని జ్యోష్యం చెప్పారు. నియోజకవర్గంలో నిరుపేదలకు ఇళ్లు కేటాయించని అసమర్థ ఎమ్మెల్యే వినయభాస్కర్ అని ఆరోపించారు. అవినీతి పాలనకు అంతం పలికే సమయం వచ్చిందని అన్నారు. ప్రజలు ఎలాగైనా ఈసారి కాంగ్రెస్ పార్టీ కి పట్టం కడతారని రాజేందర్ రెడ్డి చెప్పారు.