AP Elections : ఏపీలో ఎన్నికల నగారా మోగించేందుకు సర్వం సిద్ధమవుతోంది. వచ్చే ఏడాది మార్చిలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశముందని ఎన్నికల ప్రధాన అధికారి ముకేష్ కుమార్ మీనా తెలిపారు. ముసాయిదా జాబితాను విడుదల చేసిన ఆయన.. ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు, సవరణలకు డిసెంబర్ 9 వరకు అవకాశం కల్పించామన్నారు.
ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతోంది కేంద్ర ఎన్నికల సంఘం. ప్రస్తుతం తెలంగాణ సహా 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనుండటంతో.. ఇవి పూర్తికాగానే ఆంధ్రప్రదేశ్తోపాటు మరికొన్ని రాష్ట్రాల్లో ఎలక్షన్స్ నిర్వహించేందుకు సమాయత్తమవుతోంది. ఈ నేపథ్యంలోనే ఏపీలో ఓటర్ల జాబితాల్ని సవరించి ముసాయిదాను ప్రచురించింది. వీటిపై అభ్యంతరాలు, సవరణలకు డిసెంబర్ 9 డెడ్లైన్ పెట్టింది. ఆ తర్వాత 2024 మార్చిలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసే యోచనలో ఉంది ఎన్నికల సంఘం.
ఎన్నికల అధికారి ప్రకటన మేరకు మార్చిలో నోటిఫికేషన్ విడుదలయితే ఏప్రిల్ లో ఎన్నికలు జరిగే అవకాశముంది. ప్రస్తుతం తెలంగాణతోపాటు 5 రాష్ట్రాల్లోనూ షెడ్యూల్ ప్రకటించిన నెల రోజుల్లోనే ఎన్నికలు నిర్వహిస్తుండటంతో.. ఇదే క్రమంలో ఏపీలోనూ ఎన్నికలు జరిగే అవకాశముందని తెలుస్తోంది.
ఇక ఇప్పటికే ఏపీలో ఎన్నికల వేడి రాజుకుంటోంది. గెలుపు ఎజెండాతో.. అధికారమే లక్ష్యంగా ఎవరికి వారు వ్యూహాత్మాకంగా వ్యవహరిస్తూ ప్రచార జోరులో సాగుతున్నాయి అధికార, ప్రతిపక్ష పార్టీలు. పోటాపోటీ కార్యక్రమాలతో ప్రజలను ఆకర్షించే పనిలో పడ్డారు. క్లీన్స్వీప్ దిశగా 175 సీట్లపై కన్నేసిన వైసీపీ అధినేత సీఎం జగన్.. ఈ మేరకు ఇప్పటికే పలుమార్లు తన బలగానికి దిశానిర్దేశం చేశారు. ఇటీవల కార్యాచరణను కూడా రూపొందించారు. అందులో భాగంగానే వైసీపీ బస్సుయాత్రలు కొనసాగుతున్నాయి.
ఇక జగన్ను గద్దె దించడమే లక్ష్యంగా పెట్టుకున్న టీడీపీ అందుకు తగ్గట్టుగా ముందుకు సాగుతోంది. వైసీపీ అరాచక పాలన సాగిస్తోందని తెలియజెప్పే ప్రయత్నం చేస్తోంది. చంద్రబాబు అరెస్ట్ వైసీపీ సర్కార్ కుట్రేనంటూ ప్రజల్లోకి గట్టిగా తీసుకువెళ్తోంది. ఈ అంశాన్నే తనకు అనుకూలంగా మార్చుకోవాలన్న వ్యూహంలో ఉన్నాయి తెలుగుదేశం, జనసేన పార్టీలు. ఇక మరోవైపు ఉమ్మడిగా జగన్ను ఎదుర్కొనేందుకు టీడీపీ, జనసేన ఐక్య కార్యాచరణకు సిద్ధమవుతోంది. మరో రెండు మూడు రోజల్లో ఉమ్మడి కార్యాచరణపై ప్రకటన చేయనున్నారు ఇరు పార్టీ నేతలు.