Rahul Gandhi : తెలంగాణలో భారత్ జోడో యాత్ర చేస్తున్న రాహుల్ గాంధీ పొత్తులపై క్లారిటీ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకునే ప్రస్తక్తే లేదని తేల్చి చెప్పారు. ఒంటరిగానే పోటీ చేస్తామని ప్రకటించారు. టీఆర్ఎస్ తో పొత్తు వద్దన్నది తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం నిర్ణయమన్నారు. ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ తో ఎలాంటి అవగాహన లేదని రాహుల్గాంధీ స్పష్టతనిచ్చారు. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తు పెట్టుకునే ప్రస్తక్తే లేదన్నారు. భారత్ జోడో యాత్రలో భాగంగా రంగారెడ్డి జిల్లా తిమ్మాపూర్లో నిర్వహించిన మీడియా సమావేశంలో రాహుల్ పొత్తులపై స్పష్టత నిచ్చారు.
వచ్చే పార్లమెంట్ ఎన్నికలను విభజన శక్తులు, సంఘటిత శక్తులకు మధ్య జరిగే పోరాటంగా రాహుల్ పేర్కొన్నారు. బీజేపీ, టీఆర్ఎస్ ప్రజాధనాన్ని దోచుకుంటున్నాయని ఆరోపించారు. మునుగోడు ఉపఎన్నికకు రూ.వందల కోట్లు ఖర్చు చేస్తున్నాయన్నారు. ఆ రెండు పార్టీలకు అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని రాహుల్ ప్రశ్నించారు. బీజేపీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. గుజరాత్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచి తీరుతుందని రాహుల్ జోస్యం చెప్పారు. గుజరాత్, హిమాచల్ప్రదేశ్ ఎన్నికల్లో పోరాటంపై పార్టీ అధ్యక్షుడు ఖర్గే నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ దేశంలో విభజన రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు. ప్రతి ఒక్కరి సమస్య తెలుసుకుంటా భారత్ జోడో యాత్రతో ప్రజల్లో చైతన్యం తీసుకొస్తున్నామన్నారు.