Road Accident : పండుగవేళ ఎంతో ఆనందంగా ఉండాల్సిన కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులను రోడ్డుప్రమాదం రూపంలో మృత్యువు కబళించడంతో.. బంధువుల రోదనలు మిన్నంటాయి. తమిళనాడులో జరిగిన రోడ్డుప్రమాదంలో ఏడుగురు దుర్మరణం చెందారు. తిరువణ్ణామలై జిల్లా సెంగం పక్రిపాళయం బైపాస్ రోడ్డు సమీపంలో ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సును.. అతివేగంతో దూసుకొచ్చిన సుమో బలంగా ఢీకొట్టడంతో ఈ ఘోర దుర్ఘటన చోటుచేసుకుంది.
ఈ ప్రమాదంలో సుమోలో ఉన్న ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో నలుగురికి, బస్సులో ఉన్న 10 మంది ప్రయాణికులకు తీవ్రగాయాలయ్యాయి. ప్రమాద ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా ప్రాంతానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడినవారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కాగా.. సుమో డ్రైవర్ నిద్రలోకి జారుకోవడం వల్లే ప్రమాదం జరిగినట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు. ఈ ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.