Indian Rupee Falls : అంతర్జాతీయ మార్కెట్లో డాలర్తో పోల్చితే మన రూపాయి విలువ పడిపోతోంది. అమెరికా డాలర్తో పోలిస్తే ప్రస్తుతం రూపాయి 83.2625 వద్ద ట్రేడవుతోంది. అటు ఇజ్రాయెల్- పాలస్తీనా యుద్ధం, ఇటు.. చమురు మార్కెట్ను శాసించే రష్యా దూకుడు నేపథ్యంలో మన ఆర్బీఐ రూపాయిని బలోపేతం చేసే యత్నాలు ఆరంభించింది. ఇంతకూ రూపాయి ఇంతగా పడిపోవటానికి కారణాలేమిటో చూద్దాం.
అంతర్జాతీయ లావాదేవీల్లో డాలరుకు డిమాండ్ అధికం. భారత ‘కరెంట్ ఖాతా లోటు (సీఏడీ)’ పెరగడం, ఎగుమతి, దిగుమతుల మధ్య అంతరం కూడా రూపాయి పతనానికి కారణమవుతోంది. పీపా ముడిచమురు ధర 91 డాలర్లు దాటటంతో మన దిగుమతుల బిల్లూ నానాటికీ పెరిగిపోతోంది. దీంతో రూపాయి వణుకుతోంది. భవిష్యత్తులో భారత ఆర్థిక వ్యవస్థ పనితీరుపై అనుమానాలతో కొందరు విదేశీ పెట్టుబడి దారులు మన మర్కెట్లో నుంచి తమ పెట్టుబడిని ఉపసంహరించుకోవటం రూపాయిని బలహీనపరుస్తోంది.
అమెరికా, ఐరోపాల్లో ద్రవ్యోల్బణం కట్టడికై అక్కడి సెంట్రల్ బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచటంతో విదేశీ పెట్టుబడిదారులు భారత్లోని మదుపును అక్కడికి మళ్లించటంతో రూపాయిపై ఒత్తిడి పడుతోంది.
ఇజ్రాయెల్ దూకుడు, పెరుగుతున్న చమురు దిగుమతుల నేపథ్యంలో మన ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటేనే, రూపాయి బలపడుతుందని నిపుణులు భావిస్తున్నారు.
మన బ్యాంకుల్లోని డాలర్లను అమ్మి రూపాయి విలువను స్థిరీకరించాలని ఆర్బీఐ భావిస్తోంది. అయితే.. ఇది తాత్కాలిక పరిష్కారమే. ఆర్బీఐలోని డాలరు నిల్వలు నిండుకుంటే పరిస్థితేంటన్నదే ఇప్పుడు నిపుణులను వేధిస్తోన్న ప్రశ్న.