Honor Killing : అల్లారుముద్దుగా, అపురూపంగా పెంచుకున్న కన్నబిడ్డలు మరో కులానికి చెందినవారిని ప్రేమించారనో, వారిని పెళ్లి చేసుకున్నారన్న ఆవేశంతో పరువుకోసం ప్రాణాలు తీసేస్తున్నారు తల్లిదండ్రులు. తెలుగు రాష్ట్రాలతో పాటు.. దేశంలోని ఎన్నో ప్రాంతాల్లో పరువు హత్యలు జరిగాయి. ఒక్కొక్క ఘటనతో యావత్ దేశమే ఉలిక్కిపడింది. తాజాగా అలాంటి ఘటనే కర్ణాటకలో వెలుగుచూసింది. కూతురు దళితయువకుడిని ప్రేమించి, అతడితో పారిపోయిందన్న కోపంతో.. ఆమెను అత్యంత కిరాతకంగా చంపేశాడో కన్నతండ్రి. నాగనాథపురలోని డాక్టర్స్ లే అవుట్ లో అక్టోబర్ 31న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు నిందితుడిని మైసూరులోని హెచ్ డీ కోటేలోని కలిహుండి గణేశ(50)గా గుర్తించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కలిహుండిగణేష – శారద దంపతులకు పల్లవి అనే 17 సంవత్సరాల కుమార్తె ఉంది. వీరు గౌడ సామాజిక వర్గాికి చెందినవారు. పల్లవి హెచ్ డీ కొటేలో పీయూ చదువుతోంది. ఈ క్రమంలో పల్లవి స్థానికంగా ఉండే దుకాణంలో పనిచేసే షెడ్యూల్ కులానికి చెందిన యువకుడితో ప్రేమలో పడింది. విషయం తండ్రికి తెలియడంతో.. ఆమెను తన సోదరి గీత సంరక్షణలో ఉంచాడు. అక్టోబర్ 14న పల్లవి సదరు దళిత యువకుడితో ఇంటి నుంచి పారిపోయింది.
కూతురు కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఆమె ఆచూకీ తెలుసుకుని అక్టోబర్ 20న గీతకు అప్పగించారు. అక్టోబర్ 21న గణేష్.. గీత ఇంటికెళ్లి పల్లవి తన పరువు తీసిందని గొడవ చేశారు. ఈ క్రమంలో తన భార్య కూతుర్ని సరిగ్గా చూసుకోలేదంటూ అరిచాడు. గొడవ పెద్దది కావడంతో.. పల్లవి మెడపై కొడవలితో కత్తితో దాడి చేశాడు. భార్య, చెల్లెలు గీత అడ్డుకునేందుకు ప్రయత్నించగా వారిద్దరినీ కూడా గాయపరిచాడు. తీవ్రగాయాలపాలైన పల్లవి అక్కడే మరణించగా.. గాయపడిన శారద, గీత విక్టోరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కూతురిని చంపిన అనంతరం గణేష్ పోలీసులకు లొంగిపోయాడు.