Cyclone Hamoon : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం సోమవారం (అక్టోబర్ 23) సాయంత్రానికి తుపాన్ గా మారవచ్చని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ తుపాన్ కు హమూన్ గా నామకరణం చేశారు. ప్రస్తుతం ఈ అల్పపీడనం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉంది. ఒడిశాలోని పారాదీప్ నుంచి 400 కిలోమీటర్లు, పశ్చిమబెంగాల్ లోని దిఘాకు నైరుతి దిశలో 550 కిలోమీటర్ల దూరంలో ఇది కేంద్రీకృతమై ఉన్నట్లు ఐఎండీ తెలిపింది.
రానున్న 12 గంటల్లో ఇది తుపాను మారవచ్చని అంచనా వేశారు. ఉత్తర- ఈశాన్య దిశగా కదులుతూ.. అక్టోబర్ 25 సాయంత్రానికి తీవ్ర అల్పపీడనంగా మారి బంగ్లాదేశ్ లోని ఖేపుపరా, చిట్టగాండ్ మధ్య తీరం దాటవచ్చని వెల్లడించారు. ఈ నేపథ్యంలో తీర, లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. కాగా.. తొలుత ఈ తుపాను ప్రభావం ఇటు ఉత్తరాంధ్ర జిల్లాలు, అటు ఒడిశాపై ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కానీ.. ప్రస్తుతం ఇది బంగ్లాదేశ్ దిశగా పయనిస్తుండటంతో.. దాని ప్రభావం దాదాపు ఉండకపోవచ్చని వివరించారు. కాగా.. సముద్రంలో అల్పపీడనం కొనసాగుతున్న కారణంగా.. అల్లకల్లోలంగా ఉంటుందని, మత్స్యకారులు వెటకు వెళ్లొద్దని హెచ్చరించారు.