EPAPER

Dussehra Celebrations : ఇంద్రకీలాద్రీపై ఘనంగా దసరా మహోత్సవాలు.. రేపు కూడా దశమి గడియలు

Dussehra Celebrations : ఇంద్రకీలాద్రీపై ఘనంగా దసరా మహోత్సవాలు.. రేపు కూడా దశమి గడియలు

Dussehra Celebrations : ఇంద్రకీలాద్రిపై దేవి శరన్నవరాత్రులు చివరి రోజుకు చేరుకున్నాయి. సోమవారం రెండు రూపాల్లో దుర్గమ్మ దర్శనమివ్వనున్నారు. ఉదయం మహిషాసురమర్దిని రూపంలో కొలువై భక్తులకు దర్శనమిస్తున్న దుర్గమ్మ.. మధ్యాహ్నం నుంచి రాజరాజేశ్వరీదేవి రూపంలో దర్శనమిస్తారు.


ఉదయం నుంచి ఇంద్రకీలాద్రిపై ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఈరోజు తెల్లవారుజామున 3 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మహార్నవమి గడియల్లో శ్రీ మహిషాసుర మర్దినిగా దర్శనమిస్తారు. శరన్నవరాత్రులలో దర్శనమిచ్చే దేవీ అలంకారాలలో మహిషాసురమర్దిని అలంకారానికి ఎంతో విశిష్టత ఉంది. రాక్షసులను సంహరించి స్వయంభూగా మహిషాసుర మర్దినిగా అమ్మవారు వెలిశారు.

మధ్యాహ్నం నుంచి దశమి గడియల్లో అంటే విజయదశమి నాడు శ్రీ రాజరాజేశ్వరిదేవిగా దర్శనమిస్తారు. సప్తశతిలో దుర్గాదేవి అష్టభుజాలతో దుష్ట రాక్షసుడైన మహిషాసురుడిని సంహరించి లోకోపకారం చేశారు. సింహవాహినిగా రూపొందిన శక్తి.. వికటాట్టహాసం చేసి మహిషాసురిడి సేనాపతులైన చిక్షురుడు, చామరుడు, ఉదద్రుడు, బాష్కులుడు, బిడాలుడు వంటి రాక్షసులందరినీ సంహరించింది. ఆ తర్వాత జరిగిన యుద్ధంలో ఆ దేవి అవలీలగా మహిషాసురుణ్ణి చంపి అదే స్వరూపంతో కీలాద్రిపై స్వయంభువైంది. రౌద్రంలో ఉన్న అమ్మను శాంతింపచేసేందుకు ఇంద్రుడు తపస్సు చేశారు. అష్టభుజాలతో అవతరించి సింహవాహినియై దుష్టుడైన మహిషాసురుడిని సంహరించింది. అమ్మవారి సహజస్వరూపం ఇదే.


మహిషాసురమర్దినిని దర్శించుకుంటే అరిషడ్వర్గాలు నశిస్తాయని, సాత్విక భావం ఏర్పడుతుందని చెబుతారు. సర్వదోషాలు పటాపంచలై ధైర్య, స్థైర్య, విజయాలు చేకూరుతాయని భక్తుల విశ్వాసం. మహిషాసురమర్దినిని దర్శించుకుంటే దసరా రోజు రాజరాజేశ్వరిని కూడా దర్శించుకోవాలనే నానుడి భక్తుల్లో ఇప్పటికీ నెలకొని ఉంది. మధ్యాహ్నం 12 తర్వాత నుంచి శ్రీ రాజరాజేశ్వరి అలంకారంలో దుర్గమ్మ అభయమిస్తారు. విజయదశమి నాడు అమ్మవారిని దర్శించుకుంటే అన్ని విజయాలు చేకూరతాయని భక్తుల విశ్వాసం.

విజయదశమికి ఎంతో విశిష్టత ఉంది. రాజరాజేశ్వరి దేవిగా అమ్మవారు సింహావాహనంపై ఆసీనురాలై ఉంటారు. షోడశాక్షరీ మహామంత్ర స్వరూపిణి మహాత్రిపుర సుందరి, శ్రీచక్ర అధిష్టానదేవత శ్రీ రాజరాజేశ్వరి దేవి విజయదశమి అపరాజితాదేవి పేరు మీద ఏర్పడింది.విజయాన్ని సాధించింది కాబట్టి విజయ అని అంటారు. పరమశాంతి రూపంతో చిరునవ్వులు చిందిస్తూ చెరకుగడ చేతితో పట్టుకుని అమ్మవారు భక్తులకు దర్శనమిస్తుంది. రాజరాజేశ్వరీ దేవిని సేవించడం వలన జీవితం ధన్యమవుతుందని, నవరాత్రుల పుణ్యపలం సకల శుభాలు, విజయాలు సిద్ధిస్తాయని భక్తుల విశ్వాసం. సోమవారం సాయంత్రం కృష్ణానదిలో ఉత్సవమూర్తులను హంసవాహనంపై తెప్పోత్సవం నిర్వహించనున్నారు.

మంగళవారం కూడా దసరా గడియలు ఉండటంతో రాజరాజేశ్వరి అమ్మవారి అలంకరణలో దుర్గమ్మ భక్తులకు దర్శనం ఇవ్వనుంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ కలక్కుండా దసరా ఉత్సవాలను కొనసాగించామని ఈవో రామారావు వెల్లడించారు. భవాని భక్తుల ఇరుముళ్ల సమయంలోనూ అన్ని విభాగాలతో విజయవంతం చేయనున్నామని తెలిపారు. ఇంద్రకీలాద్రిపై ఏ డిపార్ట్‌మెంట్‌ అజమాయిషీ ఉండదని స్పష్టం చేశారు.

Related News

Tirupati Laddu: తిరుమలలో నిత్యం 3 లక్షల లడ్డూలు విక్రయం.. 500 వార్షిక ఆదాయం.. కల్తీ నెయ్యి వివాదం తరువాత..

YS Jagan: తిరుమల లడ్డూ వివాదంపై స్పందించిన జగన్.. చంద్రబాబు పెద్ద దుర్మార్గుడు

Tirupati Laddu Row: ఆ సంస్థ నెయ్యిలోనే అవన్నీ కలిశాయి.. 39 రకాల టెస్టుల్లో తేలింది ఇదే: టీటీడీ ఈవో

Vidadala Rajini: మాజీ మంత్రి విడుదల రజనీకి కష్టాలు.. రేపో మారో అరెస్ట్ తప్పదా?

Dussehra Holidays: విద్యార్థులకు గుడ్ న్యూస్.. దసరా సెలవుల తేదీలు ఇవే!

YCP vs Janasena: జనసేనలో చేరికలు.. కూటమిలో లుకలుకలు

YSRCP Petition: తిరుమల లడ్డూ వివాదం.. హైకోర్టులో వైసీపీ పిటిషన్, న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు

Big Stories

×