BJP : తెలంగాణలో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థుల మొదటి జాబితా పార్టీలో ఆగ్రహజ్వాలలు రాజేసింది. చాలాంది నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని తెలుస్తోంది. టికెట్ దక్కకపోవడంతో నిర్మల్ బీజేపీ అధ్యక్షురాలు రమాదేవి బోరున ఏడ్చేశారు. వరంగల్ వెస్ట్ టికెట్ రావు పద్మకు దక్కడంతో రాకేష్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. విక్రమ్ గౌడ్కు కూడా కమలం పార్టీ హ్యాండిచ్చింది. గోషామహల్ టికెట్ కోసం విక్రమ్ గౌడ్ ప్రయత్నించారు. అయితే బీజేపీ మొండిచేయి చూపింది.
మునుగోడులో పోటీకి విముఖత వ్యక్తం చేసిన రాజగోపాల్ రెడ్డి… ఎల్బీ నగర్ టికెట్ కోసం పట్టుపడుతున్నారు. అయితే ఆయనకు ఎల్బీ నగర్ టికెట్ ఇవ్వడానికి బీజేపీ అధిష్టానం నిరాకరించిందని చెబుతున్నారు. మరోవైపు మొదటి లిస్ట్లో పేరు లేకపోవడంపై వివేక్ వెంకట స్వామి కూడా అసంతృప్తిగా ఉన్నారని తెలుస్తోంది. ధర్మపురి నుంచి పోటీ చేయడానికి వివేక్ వెంకటస్వామి ఆసక్తి చూపిస్తున్నారు. అయితే చెన్నూర్ నుంచి పోటీ చేయాలని పార్టీ సూచిస్తోందనే చర్చ జరుగుతోంది. కానీ చెన్నూర్ నుంచి పోటీ చేయడానికి వివేక్ ఆసక్తి చూపడం లేదని అంటున్నారు.
డీకే అరుణది కూడా ఇదే పరిస్థితి. మహబూబ్నగర్, నారాయణపేట స్థానాల్లో ఏదో ఒకటి ఇవ్వాలని డీకే అరుణ కోరుతున్నారు. అయితే గద్వాల నుంచే పోటీ చేయాలని డీకే అరుణపై పార్టీ ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. దీంతో పార్టీ వైఖరిపై ఆమె కూడా ఆగ్రహంగా ఉన్నారనే వార్తలు వస్తున్నాయి.
మొదటి లిస్ట్లో జితేందర్ రెడ్డి పేరు లేకపోవడంతో ఆయన అభిమానులు తాడోపేడో తేల్చుకోవాలని ఒత్తిడి తెస్తున్నారని తెలుస్తోంది. ఇక కొండా విశ్వేశ్వర్రెడ్డి తాండూర్ నుంచి పోటీ చేయాలనుకున్నా… ఆయన పేరు మొదటి జాబితాలో లేదు. దీంతో కొండా అభిమానుల్లో నిరుత్సాహపడ్డారని తెలుస్తోంది. జనసేనకు కేటాయించే టికెట్లపైనా పార్టీలో చర్చ జరుగుతోంది. తెలంగాణలో క్షేత్రస్థాయిలో ఏ మాత్రం బలం లేని జనసేనకు 12 టికెట్లు కేటాయించడంపై పార్టీ సీనియర్లు అసహనంతో ఉన్నారని అంటున్నారు. పార్టీ నిర్ణయాలు బీఆర్ఎస్కు కలిసొచ్చేలా ఉన్నాయని బీజేపీలో అంతర్గత చర్చ జరుగుతోంది.