wars : భూగోళం రక్తసిక్తమవుతోంది. ప్రపంచవ్యాప్తంగా 32 చోట్ల కొనసాగుతున్న యుద్ధాలు, సంఘర్షణల్లో వేల మంది అమాయక పౌరులు సమిధలుగా మారుతున్నారు. ఇజ్రాయెల్-పాలస్తీనా, ఉక్రెయిన్-రష్యా, అఫ్ఘానిస్థాన్ యుద్ధాలు, ఆఫ్రికాలోని సాహెల్ రీజియన్లో తీవ్రవాదం, మయన్మార్లో అంతర్యుద్ధం, తైవాన్ కోసం సంఘర్షణలు, హైతీలో అనిశ్చితి, కాంగోలో జాతుల ఘర్షణలు, సూడాన్లో అధికారం కోసం పోరు, పాకిస్థాన్ లో అస్థిరత్వం.. ఇలా ఏదో ఒక కారణంగా వేల సంఖ్యలో ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి.
తొలిసారిగా 13 వేల సంవత్సరాల క్రితం నీటి కోసం ఈజిప్టు-సూడాన్ సరిహద్దుల్లో యుద్ధం చెలరేగింది. నాటి నుంచీ యుద్ధం తీరుతెన్నులు, ఆయుధ వినియోగంలో విప్లవాత్మక మార్పులొచ్చాయి. మందుగుండు, ఫిరంగుల నుంచి నేటి కెమికల వెపన్స్ వరకు ఏ ఏ ఆయుధం ఎందరి ప్రాణాలను బలి తీసుకున్నదీ ఓ సారి తెలుసుకుందాం.
తొలినాళ్లలో యుద్ధాల్లో వాడినవి ఫిరంగులే. వీటి వల్ల 19.6 కోట్ల మంది చనిపోయారు. ఫిరంగుల పుట్టిల్లు ప్రాచీన చైనా అని చెబుతుంటారు. ప్రధానంగా మందుగుండు కూర్చే ఫిరంగులను ఆ దేశమే ప్రవేశపెట్టింది. 13వ శతాబ్దంలో అవి అక్కడ నుంచి పశ్చిమాసియాకు, యూరప్కు చేరాయి. శతాబ్దాల పాటు ఇవి యుద్ధాల్లో ఉపయోగపడ్డాయి.
మధ్యయుగం చివరి కాలం వచ్చేసరికి చేతితో ఉపయోగించే చిన్నఆయుధాలు వచ్చాయి. ఆక్వెబస్, మస్కెట్ వంటి తుపాకులు యుద్ధం రూపురేఖలనే మార్చేశాయి. దాదాపు 14.1 కోట్ల మంది వీటికి బలయ్యారు. సాంకేతిక పరిజ్ఞానం పెరగడంతో అవి రైఫిల్స్, పిస్టల్స్గా రూపాంతరం చెందాయి.
మందుగుండు కన్నా ముందు ఈటెలు, బరిసెలను వాడారు. జంతువుల వేట కోసం కనుగొన్న వీటిని ప్రాచీన యుద్ధాల్లో విరివిగా ఉపయోగించారు. 6 కోట్ల మంది వీటి వల్ల చనిపోయారని అంచనా.
కత్తులు, కటార్లు కూడా అతి ప్రాచీన ఆయుధాలే. కాంస్యయుగంలో రాజులు వీటిని వాడేవారు. ఇవి 5.2 కోట్ల మందిని బలి తీసుకున్నాయి. ప్రాచీన ఆయుధాల్లో మరొకటి మేస్. బాణాకర్ర, దుడ్డుకర్రగా వ్యవహరించే ఈ ఆయుధానికి 3.7 కోట్ల మంది ప్రాణాలు విడిచారు.
మహాభారతం, రామాయణ గాథల్లో విల్లంబుల గురించి ఎక్కువగా వింటుంటాం. విలువిద్యకు నేటికీ ఎంతో ప్రాధాన్యం ఉంది.విల్లు-బాణాల వల్ల 1.9 కోట్ల మంది చనిపోయి ఉంటారు. విధ్వంసానికి చిరునామాగా బాంబులను చెప్పుకోవచ్చు. మొదటి ప్రపంచ యుద్ధంలో వీటిని తక్కువగానే వాడారు. తొలినాళ్లలో పేలుడు పదార్థాన్ని ఓ కంటెయినర్లో ఉంచి పేల్చేవారు.
అణుబాంబు ప్రయోగంతో.. విధ్వంసం ఎంతలా ఉంటుందో ప్రపంచం చవిచూసింది. రెండో ప్రపంచ యుద్ధంలో హిరోషిమా, నాగసాకిపై వేసిన అణుబాంబులతో 2.26 లక్షల మంది వరకు ప్రాణాలొదిలారు. ఇక రసాయన ఆయుధాల వల్ల అంత కన్నా ఎక్కువ విధ్వంసమే జరుగుతుంది. ప్రాణనష్టమైతే మరీ ఎక్కువ. మొదటి ప్రపంచయుద్ధ సమయంలోనే వీటిని వినియోగించినా.. ఆ వెంటనే నిషేధం విధించారు. వీటి వల్ల ఇప్పటివరకు 4 లక్షల మంది వరకు చనిపోయి ఉంటాని అంచనా.