Rajahmundry : 44 రోజులుగా టీడీపీ అధినేత చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే ఉన్నారు. ఆయన భార్య నారా భువనేశ్వరి ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. అలాగే రాజమండ్రిలోని ఓ హోటల్లో టీడీపీ జనసేన సంయుక్త కార్యాచరణ కమిటీ భేటీ కానుంది. ఈ సమావేశంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్, నారా లోకేశ్ పాల్గొంటారని తెలుస్తోంది. వీరితోపాటు ఇరు పార్టీల నుంచి 14 మంది కమిటీ సభ్యులు సైతం హాజరుకానున్నారు. జనసేన, టీడీపీ ఉమ్మడి కార్యాచరణపై చర్చించే అవకాశం ఉంది.
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సాధ్యమైనంత ఎక్కువగా ప్రజల్లో ఉండేలా కార్యాచరణ రూపొందించాలని టీడీపీ, జనసేన నేతలు భావిస్తున్నారు. అంతేకాకుండా ఉమ్మడిగా ఉద్యమాలు కొనసాగిస్తూనే ఎవరికివారు పార్టీలపరంగా ప్రజల్లోకి వెళ్లే యోచనలో ఉన్నారు. మరి సీట్ల పంపకాలపై ఏమైనా చర్చ జరుగుతుందనే ఆసక్తి నెలకొంది.
మరోవైపు రాష్ట్ర ప్రజలకు దసరా శుభాకాంక్షలు చెబుతూ జైలు నుంచే చంద్రబాబు లేఖ విడుదల చేశారంటూ వచ్చిన వార్తలపై జైలు సూపరింటెండెంట్ వివరణ ఇచ్చారు. జైలు నుంచి ఎటువంటి లేఖ విడుదల కాలేదని స్పష్టం చేశారు. జైలు నిబంధనల ప్రకారం జైలు నుంచి లేఖ విడుదల అయితే సంబంధిత అధికారి సంతకం ఉంటుందని వెల్లడించారు. ఇంకోవైపు ములాఖత్లో కుటుంబ సభ్యులు కలిసినప్పుడు వారి ద్వారా చంద్రబాబు లేఖ విడుదల చేశారని టీడీపీ నేతల చెబుతున్నారు.