Medigadda Barrage : తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టులో ప్రధానమైనది మేడిగడ్డ బ్యారేజీ. కొన్ని తరాల పాటు ఎలాంటి చెక్కుచెదరకుండా ఉండాల్సిన బ్యారేజీ…నేడు ప్రమాదకరస్థాయికి చేరుకోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ నిర్లక్ష్యం, వైఫల్యం వల్లే ఇంత పెద్ద ప్రమాదం వచ్చి పడిందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఘటనపై సిట్టింగ్ జడ్జి సహా సీవీసీతో విచారణ జరిపించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ముఖ్యమంత్రి వైఖరి వల్ల కాళేశ్వరం విఫల ప్రాజెక్టుగా మారిందన్న బీజేపీ.. వరుస ప్రమాదాలపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేసింది.
మేడిగడ్డ బ్యారేజీ ప్రమాదానికి కేసీఆర్ కుటుంబమే కారణమని రేవంత్రెడ్డి, భట్టి విక్రమార్క ఆరోపించారు. ఈ ప్రాజెక్ట్ నిర్మించినప్పుడు డబ్బులు వృథాగా పోతాయని అప్పుడే చెప్పామని.. అది ఇప్పుడు నిరూపితమైందని విమర్శించారు. కేంద్ర హోంమంత్రి, గవర్నర్.. మేడిగడ్డపై విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు నాణ్యతపై క్షేత్రస్థాయి సందర్శనకు రావాలని మంత్రులు, హరీశ్రావు, కేటీఆర్కు సవాల్ విసిరారు.
మంచి ఎన్నికల హీట్ ఉన్న సమయంలో…. ప్రభుత్వ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు దెబ్బతినడం… ఒక విధంగా BRS ప్రభుత్వానికి పెద్ద నష్టమే. ఈ ప్రాజెక్ట్ కుంగిపోవడం మానవతప్పిదంగా నిరుపితమైంది. కేసీఆర్, హరీశ్రావు గొప్పగా చెప్పుకునే ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం పెను ప్రమాదంలో పడిందన్నారు రేవంత్రెడ్డి. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారని నిలదీశారు. లక్ష కోట్లు సీఎం కేసీఆర్, కొంత మంది కాంట్రాక్టర్లు కలిసి పంచుకున్నారని ఆరోపించారు.
మేడిగడ్డ బ్యారేజ్ డ్యామేజీపై ఇంకా క్లారిటీ రాలేదు. 57 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. నీరు పూర్తిగా ఖాళీ అయిన తర్వాతే బ్యారేజీ ప్రమాదంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం రిజర్వాయర్లో 0.6 టీఎంసీల నీరు ఉంది. నేడు బ్యారేజీ సందర్శనకు కేంద్ర నిపుణుల బృందం రానుంది. ఇప్పటికే మేడిగడ్డ బ్యారేజ్ పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. ప్రజలెవరూ అటు వెళ్లకుండా ఆంక్షలు విధించారు. తెలంగాణ, మహారాష్ట్రకు రాకపోకలు నిషేధించారు.