Komatireddy Rajgopal Reddy : కాంగ్రెస్లోకి కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారా? మునుగోడు స్థానాన్ని తిరిగి రాజగోపాల్రెడ్డికి ఇచ్చే ఆలోచనలో కాంగ్రెస్ ఉందా? ఇప్పుడు ఇదే అంశం కాంగ్రెస్, బీజేపీల్లోనే కాదు.. తెలంగాణ రాజకీయాల్లోనూ హాట్ టాపిక్ గా మారింది. బీజేపీ ముఖ్యనేతల్లో ఒకరైనప్పటికీ మొదటి లిస్టులో రాజగోపాల్రెడ్డి పేరు లేదు. దీంతో ఆయన కాంగ్రెస్ లోకి తిరిగి వస్తారనే ప్రచారం మొదలైంది. అందుకే బీజేపీ అధిష్టానం టిక్కెట్ ప్రకటించలేదని తెలుస్తోంది.
2018 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి మునుగోడు ఎమ్మెల్యేగా రాజగోపాల్రెడ్డి విజయం సాధించారు. గతేడాది కాంగ్రెస్కు రాజీనామా చేశారు. ఆ తర్వాత కాషాయ కండువా కప్పుకున్నారు. ఉపఎన్నికలో బీజేపీ తరఫున పోటీ చేశారు. అయితే ఆ ఎన్నికలో రాజగోపాల్రెడ్డి ఓడిపోయారు.
బీజేపీ నుంచి పోటీ చేసి ఓడినా, ఆయనకు మునుగోడు టికెట్ ఖరారు చేయలేదు బీజేపీ. మరోవైపు తొలి జాబితాలో మునుగోడును పెండింగ్లో పెట్టింది కాంగ్రెస్. మునుగోడు సీటును సీపీఐకి ఇస్తామని ఇంతకుముందు కాంగ్రెస్ ప్రకటించింది. కానీ ఇప్పుడు మునుగోడు కాకుండా సీపీఐకి కొత్తగూడెం, చెన్నూరు ఇస్తామంటోంది హస్తం పార్టీ .
అంటే సీపీఐ ఇవ్వకుండా రాజగోపాల్ రెడ్డి కోసమే ఆ సీటును కాంగ్రెస్ పెండింగ్ లో ఉంచుతోందా అనే అనుమానం కలుగుతోంది. కాంగ్రెస్ రెండో జాబితా ప్రకటనకు ముందు రాజగోపాల్ రెడ్డి తిరిగి పార్టీలో చేరికపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.