Ayodhya Temple : అయోధ్య రామాలయ నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. స్వామివారి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా సిద్ధం చేస్తున్నారు. స్వామివారి సింహాసనం, తలుపులు, శిఖరానికి బంగారు పూత పూయడానికి ప్లాన్ చేస్తున్నారు.
రాంలాలా విగ్రహం తయారీ పనులు 80 శాతం పనులు పూర్తి అయ్యాయి. మిగిలిన 20 శాతం పనులు చివరి దశలో ఉన్నాయి. అవి కూడా చివరి దశకు వచ్చాయని ఉడిపికి చెందిన రామమందిర్ ట్రస్ట్ సభ్యుడు, పీఠాధీశ్వర్ విశ్వతీర్థ ప్రపన్నాచార్య మహరాజ్ తెలిపారు. ఆలయ స్తంభాలపై పలు విగ్రహాలు చెక్కుతున్నారు. ఒక్కో స్తంభంపై 6000 విగ్రహాలు ఉంటాయని రామమందిర్ ట్రస్ట్ సభ్యుడు అనిల్ మిశ్రా చెప్పారు.
ఆలయంలో మొత్తం 42 తలుపులు ఉంటాయి. అందులో 18 తలుపులు ఆలయ గర్భగుడి సమీపంలో ఉంటాయి. వాటన్నిటికీ బంగారు పూత వేయనున్నారని రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు క్యాంపు కార్యాలయ ఇన్చార్జి ప్రకాష్ గుప్తా తెలిపారు. ఆలయ నిర్మాణానికి విరాళాల రూపంలో భక్తులు.. బంగారం, వెండి ఇస్తున్నారు. అటు.. శాస్త్రవేత్తల సలహా మేరకు మహారాష్ట్రకు చెందిన టేకు కలపతో తలుపులు తయారు చేస్తున్నారు.