wind technology : గత దశాబ్ద కాలంలో రెన్యువబుల్ ఎనర్జీ వినియోగం రెట్టింపైంది. ప్రధానంగా పవన విద్యుత్తు రంగం శరవేగంగా పురోగమిస్తోంది. పవన విద్యుత్తు ప్లాంట్ల నిర్మాణం, నిర్వహణకు పెద్ద ఎత్తున టెక్నీషియన్ల అవసరం ఉంది. 2027 నాటికి మొత్తం 5 లక్షల మంది నిపుణులు కావాలని గ్లోబల్ విండ్ ఆర్గనైజేషన్(జీడబ్ల్యూఓ) నివేదించింది.
పునరుత్పాదక ఇంధన రంగంపై కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు భవిష్యత్తులో మరింతగా దృష్టి సారిస్తాయని.. అందుకే ఈ రంగంలో అవకాశాలు అపారమని చెబుతోంది. 2023-27 మధ్య పవన విద్యుత్తు రంగంలో మొత్తం 5,74,000 నిపుణుల అవసరం ఉంటుంది. పవన విద్యుత్తు రంగం పురోభివృద్ధి దృష్ట్యా దాదాపు 43 శాతం నిపుణ కార్మికులు కొత్తగా జత కలుస్తారని జీడబ్ల్యూఓ నివేదిక వెల్లడించింది.
పవన విద్యుత్తు ప్లాంట్ల స్థాపిత సామర్థ్యం 2022లో 78 గిగావాట్లు ఉండగా. 2027 నాటికి 155 గిగావాట్లకు చేరుతుంది. విండ్ ప్లాంట్ల నిర్మాణం, నిర్వహణ తదితర పనులను చూసే నిపుణ కార్మికులు 17% పెరుగుతారని ఆ నివేదిక పేర్కొంది. ఆఫ్షోర్ విండ్ ఎనర్జీ మార్కెట్ విస్తరిస్తున్నందున రానున్న ఐదేళ్లలో 2,43,800 మందిని కొత్తగా ఈ రంగంలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపింది.
ఆన్షోర్, ఆఫ్షోర్ కలిపి భారత్ సహా పది దేశాల్లో వారికి అవకాశాలు బోలెడు ఉన్నాయి. అమెరికాలో విండ్ పవర్ ప్లాంట్ల కోసం నిపుణ కార్మికులు అధిక సంఖ్యలో కావాల్సి ఉండగా.. భారత్, ఆస్ట్రేలియా, బ్రెజిల్, చైనా, కొలంబియా, ఈజిప్టు, జపాన్, కెన్యా, దక్షిణ కొరియా దేశాల్లోనూ వారి అవసరం ఉంది.