Medigadda Barrage : కాళేశ్వరం ఎత్తిపోతల్లోని మేడిగడ్డ బ్యారేజీ వంతెన ప్రమాదం అంచున ఉంది. ఒక్కసారిగా వంతెన కొంతమేరకు కుంగింది. శనివారం రాత్రి భారీ శబ్దంతో బి-బ్లాకులోని 18,19,20,21 పిల్లర్ల మధ్య ఉన్న వంతెన అడుగు మేర కుంగిపోయింది. బ్యారేజీ 20వ పిల్లర్ కుంగడంతోనే పైన వంతెన కుంగినట్లు అనుమానిస్తున్నారు. బ్యారేజీ పొడవు 1.6 కిలోమీటర్లు. డ్యామ్ పరిసరాల్లో నీటిపారుదల శాఖ ఇంజినీర్లు అలర్ట్ ప్రకటించారు. ఈ బ్యారేజీ పై నుంచి రాకపోకలు నిలిపివేశారు. దీంతో మహారాష్ట్ర- తెలంగాణ రాష్ట్రాల మధ్య రాకపోకలు బంద్ అయ్యాయి.
20వ పిల్లర్ బేస్మెంట్ డ్యామేజ్ అయినట్లుగా అధికారులు నిర్ధారించారు. మూడో బ్లాక్ కుంగిపోతోంది. సాయంత్రం వరకు మొత్తంగా మూడో బ్లాక్ కూలిపోయే ప్రమాదం ఉంది. ఇప్పటికే 19, 20 పిల్లర్ల సబ్ స్ట్రక్చర్ రెండుగా చీలిపోయింది. బీమ్ల వెయిట్ పడుతుండటంతో మరో రెండు పిల్లర్లపై భారం పడుతోంది.
2019లో జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలో మేడిగడ్డ వద్ద గోదావరి నదిపై ఈ బ్యారేజీ నిర్మించారు. ఇది కాళేశ్వరం ఎత్తిపోతల్లోమొదటిది. శనివారం రాత్రి సమయానికి ఎగువ నుంచి జలాశయానికి 25 వేల క్యూసెక్కుల వరకు ప్రవాహం వస్తోంది. ప్రాజెక్టు 8 గేట్లు తెరిచి దిగువకు నీటిని వదిలారు. పెద్ద శబ్దం రావడంతో ప్రాజెక్టు కార్యనిర్వాహక ఇంజినీర్ తిరుపతిరావు, సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. వారు పరిశీలన చేస్తున్న సమయంలో మళ్లీ శబ్దాలు రావడంతో వెంటనే ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు దృష్టికి తీసుకెళ్లారు.
బ్యారేజీలో సామర్థ్యం 16.17 టీఎంసీలు. ఘటన జరిగే సమయానికి 10.17 టీఎంసీల జలాలు నిల్వఉన్నాయి. ముందు జాగ్రత్త చర్యగా జలాశయాన్ని ఖాళీ చేసే చర్యలు ప్రారంభించారు.మొదట 12 గేట్లు, ఆ తర్వాత వ 46కు పెంచారు. అలా 50 వేల క్యూసెక్కుల నీటిని వదిలారు.
తెలంగాణ- మహారాష్ట్ర సరిహద్దులను కలిపే వంతెన కుంగడంతో పోలీసులు రాకపోకలు ఆపేశారు. డ్యాం ప్రమాదంపై మహారాష్ట్రలోని సిరోంచ, తెలంగాణ వైపు మహదేవపూర్ పోలీసులకు ఇంజనీర్లు ఫిర్యాదు చేశారు. ఎల్అండ్ టీ సంస్థ నిపుణులు అర్ధరాత్రికి మేడిగడ్డ వచ్చారు. డ్యామ్ నిర్వహణ గుత్తేదారు పరిధిలోనే ఉంది.గతేడాది 29 లక్షల క్యూసెక్కుల వరదను డ్యామ్ ఎదుర్కొంది. మేడిగడ్డ వంతెన కుంగడాన్ని సుమోటోగా తీసుకోవాలని న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.