BJP : తెలంగాణలో ఎన్నికలకు ముందు బీజేపీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పై సస్పెన్షన్ ఎత్తివేసింది. ఈ మేరకు బీజేపీ అధిష్టానం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు రాజాసింగ్ పై పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. గతేడాది ఆగస్టు 23న ఆయన్ను సస్పెండ్ చేసింది. వివాదస్పద వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. తాజాగా రాజాసింగ్ పై సస్పెన్షన్ను ఎత్తివేస్తున్నట్లు బీజేపీ కేంద్ర క్రమశిక్షణ సంఘం సభ్య కార్యదర్శి ఓం పాఠక్ ప్రకటించారు.
కాషాయ పార్టీ సస్పెండ్ చేసినా రాజాసింగ్ వేరే పార్టీలోకి చేరేందుకు ప్రయత్నించలేదు. తనపై సస్పెన్షన్ ఎత్తివేస్తారనే నమ్మకంతోనే ఉన్నారు. ఆయన చాలా సందర్భాల్లో ఈ విషయాన్ని ప్రస్తావించారు. తాను బీజేపీ నుంచి వచ్చే ఎన్నికల్లో బరిలోకి దిగుతాననే విశ్వాసాన్ని ప్రకటించారు. సరిగ్గా ఎన్నికల ముందు ఆయన నిరీక్షణ ఫలించింది. బీజేపీ అధిష్టానం కరుణించింది. రాజాసింగ్ పై సస్పెన్షన్ ను ఎత్తివేసింది.
2018 ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ ఒక్క ఎమ్మెల్యే సీటును మాత్రమే సాధించింది. ఆ ఒక్క ఎమ్మెల్యే రాజాసింగ్. ఆయన గోషామహల్ నుంచి వరుసగా రెండోసారి విజయం సాధించారు. ఆ నియోజకవర్గంలో ఆయనకు మంచి పట్టుఉంది. ఇప్పుడు మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలన్న పట్టుదలతో ఉన్నారు. ఇక సస్పెన్షన్ ఎత్తివేయడంతో ఆయనకే గోషామహల్ సీటు దక్కడం ఖాయం. మరి రాజాసింగ్ హ్యాట్రిక్ కొడతారా?