Saleshwaram: అభయారణ్యపు దారుల్లో బారులు తీరేవాహన విస్పోటం. జనసంద్రంగా మారే కీకారణ్యం . కరుకైన రాళ్ల మార్గంలో కొండఅంచుల్లో కఠినమైన ప్రయాణాలు . గిరులు, ధరులు హర నామస్మరణతో మారుమోగే వేళ. లింగమయ్యకు జరిగే సలేశ్వర జాతర ఆధ్యాత్మిక సాహసయాత్ర విశేషాలను తెలుసుకుందాం.
కనుచూపు మేరా నిండిన కరుకైన రాళ్ల నడుమ సాగే యాత్ర అది. అడుగులు ఇంకెంతసేపు అంటున్నా వదలక చేసే ప్రయాణమది. కొండసొరికెల మధ్య ధరుల దారుల్లో ఆపద పొంచి ఉన్నా నెరవక అలుపును అనుచుకుంటూ చేసే సాహసమది.. అదే తెలంగాణ అమర్నాథ్ యాత్రగా పేరొందిన సలేశ్వర లింగమయ్యజాతర .
మౌన మునుల్లా తపస్సు చేస్తున్నాయా అన్నట్లుగా కనిపించే భారీ వృక్షాలు ఓవైపు . చైత్రమాసంతో వచ్చిన వసంతాన్ని నింపుకొని లేత ఎరుపు ఆకుపచ్చ కలగలుపులతో ఇప్పుడిప్పుడే కొత్తచిగుర్లు తొడుక్కుంటున్న అడవిచెట్లు మరోవైపు . గిరుల ధరుల నుడి జాలువారే జలకలతో నిత్యం పచ్చదనపు పందిరిగా మారి అడవికే అందాలను తెచ్చేలా గుట్టల గుండెలను వికసింపచేస్తూ కనువిందు చేస్తున్న చెట్లు ఇంకోవైపు . పచ్చదన రాకకై ఆకాశం దిశగా ఆశగా చూస్తు కనిపించే ఆకురాల్చిన తరువులు ఇలా ఎంతో వైవిధ్యభరిత కలబోతతో కలిసి ఉన్న నల్లమల కారడవిలో కఠినమైన రాళ్లదారులను దాటుతూ కొండంచు చివర్లలో జాగ్రత్తగా అడుగులు వేస్తూ సాగుతూ పక్షుల కిలకిల రాగాలను కీచుపిట్టల అరుపులను వింటు . అక్కడక్కడ సొరికల నుంచి సన్నటి వేర్లను తాకుతూ జాలువారే అమృత బిందువులలాంటి నీరు తలపై పడుతుండగా సాగే ప్రయాణం . ప్రయాణంలో ప్రయాస ఉన్నా. ఆ అలుపు సలుపులని దాటితేనే సలేశ్వర లింగమయ్య దరికి చేరేది.
ఏటా ఉగాది తర్వాత వచ్చే పౌర్ణమికి నల్లమల అడవుల్లోని అభయారణ్యంలో కొలువైన సలేశ్వర లింగమయ్యస్వామి జాతర జరుగుతుంది. నాగర్ కర్నూల్ జిల్లా లింగాల మండలంలో అప్పాయిపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని రాంపుర్ పెంటలో ఈ సలేశ్వరం ఉంది. చెంచు సంప్రదాయాల ప్రకారం ఏడాదికోసారి ఐదురోజులపాటు జరిగే ఈ జాతర ఛైత్ర పౌర్ణమికి ముందు రెండురోజులు, ఆ తర్వాత రెండురోజులు సాగుతుంది. మాములు సమాయాల్లో ఈ ఆలయంలోకి ఎవరికి అనుమతి ఉండదు. కానీ జాతర సమయాల్లో సాధారణ ప్రజానీకానికి అనుమతి ఇవ్వడంతో ఈ జాతర చూడాలని భక్తులు ఎక్కడిడెక్కడినుండో తరలివస్తుంటారు.
రాంపూర్ బేస్ క్యాంప్ దగ్గర మంచినీరు, వైద్య సదుపాయాలు, అన్నదాన వితరన ,వివిధ రకాల వనమూలికలు , ఇతరత్ర తినుబండారాలు లభ్యమవుతాయి. అక్కడ వాహనాలను ఉంచి నడకమార్గం ద్వారా సలేశ్వరం వెల్లాలి. పిల్లలు వృద్ధులు అని తేడా లేకుండా అన్ని వయసుల వారు నడక మార్గంలో కనిపిస్తారు. బేస్ క్యాంప్ నుంచి మెదలయ్యే మార్గం మెత్తం రాళ్లతో ఏటావాలుగా ఉండటంతో చాలా జాగ్రత్తగా నడవాల్సి ఉంటుంది. కొందరు పడిపోకుండా నడవడానికి ఊతంగా ఉండేందుకు కర్రలను ఉపయోగిస్తారు. అలా పిల్లా పాపలతో సాగిపోతుంటారు.
ఏటవాలుగా ఉన్న రాళ్లదారి దాటగానే కొంతదూరం తక్కువ రాళ్లతో ఉన్న సమాంతరంగా ఉండే తోవ ఉంటుంది. ఈ మార్గంలో ఎదురయ్యే భారీ లోయలు మనల్ని అబ్బుర పరుస్తాయి. అలా సాగుతూ పోగా పెద్ద పెద్ద ధరులతో ఉన్న కొండవాలు మార్గం ఉంటుంది. ఈ మార్గంలో ఓ వైపు పెద్ద కొండలు మరో పక్క లోయ ఉంటుంది. ఆ నడుమ చిన్నదారి.. చాలా దూరం వరకు మార్గం అలానే ఉంటుంది. కొన్ని చోట్ల కొండల నుంచి రకరకాల చెట్ల వేర్లు నీటిధారలతో జాలువారుతూ కనిపిస్తాయి. ఈ మార్గం చూడటానికి అద్భుతంగా ఉన్నా ప్రమాదకరమైనది. చాలాజాగ్రత్తగా నడవాల్సి ఉంటుంది. ఏమాత్రం ఏమర పాటుగా ఉన్నా ప్రాణాలకే ప్రమాదం.ఇంత ప్రమాదం అడుగడుగునా పొంచి ఉన్నా భక్తులు మాత్రం తరగని నమ్మకంతో తరలివస్తూనే ఉన్నారు.
అమర్నాథ్ యాత్రలో ఎలాంటి వ్యయ ప్రయాసలుంటాయో ఇక్కడ అదే మాదిరిగా ఉంటుంది. అయితే ఎన్ని ఇబ్బందులున్నా భక్తుల రద్దీ మాత్రం ఏ ఏటికాయేడు పెరుగుతూనే ఉంది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలతోపాటు రాష్ట్రవ్యాప్తంగా ఎంతోమంది భక్తులు పిల్లలు, వృద్ధులతో ఈ యాత్రకు వస్తూనే ఉన్నారు. దీంతో ఇసుకేస్తే రాలనంతగా భక్తజన సందోహం నెలకొంది . అయితే కిందికి వచ్చిపోయేమార్గాలు ఒకటే కావడంతో తీవ్ర రద్దీ యాత్రగా మారిపోయింది. లోయలోకి దిగేకొద్ది శ్వాస తీసుకోవడం కాస్తా ఇబ్బందిగా అనిపిస్తుంది. దీంతో మార్గమధ్యలో ఆగుతూ విశ్రాంతి తీసుకుంటూ గుట్టకింద సలేశ్వర లింగమయ్య కొలువయ్యే ప్రధాన గుహలమార్గం దిశగా చేరుకుంటాం. అక్కడి నుంచి మార్గమంతా తీవ్ర రద్దీగా తోపులాటలతో కూడుకొని ఉంటుంది.
సలేశ్వర లింగమయ్య కొలువైన ప్రధాన గుహ ఉండే కొండలివి. ఇప్పటిదాకా పడ్డ శ్రమ ఒకెత్తు ఇప్పుడు వెల్లబోయేమార్గం మరోఎత్తు. కింద రాళ్ల మీద నడుము లోతు నీరు ఉంటుంది. ఈ మార్గం గుండా కొంతరూరం నడవాల్సిఉంటుంది . అలా నీటిలో నడుస్తూ ఉండగా రెండుగుట్టల ధరుల దారుల్లో కేవలం ఒక్క మనిషి మాత్రమే పట్టెంత మూరెడంత మార్గంలో మెల్లగా సాగిపోతే. ఎప్పుడెప్పుడా అని భక్తులు ఎదురుచూసే సలేశ్వర స్వామి గుహ అల్లంత దూరంలో కనిపిస్తూ ఉంటుంది. మన చుట్టు రెండుపొడవైన గుట్టలు ఒకదానికొకటి సమాంతరంగా ఆకాశాన్ని తాకుతున్నాయా అన్నట్లుగా కనిపిస్తాయి. స్వామివారు ఒక గుట్టలోపలి గుహలో ఉండగా మరో గుట్ట మీది నుంచి దూకే జలపాతం రెండు కొండల మధ్య గుండంలో దూకుతూ కనిపిస్తూ అంతసేపు పడ్డ కష్టాన్ని మరిచిపోయేలా చేస్తాయి. ఆకుపచ్చని దరుల దారుల్లోంచి అల్లంత ఎత్తు నుంచి దూకే గంగ అత్యంత సుందరంగా కనిపించి కనులకు విందుగా కనిపిస్తుంది. అచ్చమైన ప్రకృతి స్వచ్ఛంగా మన మేనును తాకుతుంది. గుండం నుంచి వచ్చే నీటిలో స్నానాలు చేసి భక్తులు దర్శనానికి వెళుతుంటారు. గుండం పక్కన ఉన్న గుట్టలోని గుహలోనే లింగమయ్య స్వామి ఉంటాడు.
పాల్కూరి సోమనాథుడు రాసిన పండితారాద్య చరిత్రలోనూ సలేశ్వర ప్రస్తావన ఉంది. ఈ సలేశ్వరంలోని రెండు అంతస్తుల్లోని గుహల్లో ఇక్ష్వాకుల నాటి విష్టుకుండినులనాటి ఇటుక గోడలు శాసనాలు సహితం ఉన్నాయి. విష్టుకుండి రాజులు కట్టించిన ఆలయాలు సహితం తమ తొలి రాజధాని అయిన అమ్రాబాద్ పరిసర ప్రాంతాల్లోని నల్లమల అడవుల్లో లోయలు జలపాతాల కింద ఎక్కువగా ఉన్నాయి. నల్లమల అనాధిగా చెంచులకు ఆవసస్థానం వీరి ప్రధాన దైవం కూడా మల్లికార్జునస్వామే వారు ఆ పరమేశ్వరుడిని అల్లుడిగా భావిస్తారు. అందుకే ఇక్కడి అడవుల్లో కొలువైన శివాలయాల్లో వీరిపద్దతులు సంప్రదాయాల ప్రకారమే పూజజరుగుతుంది . ఇప్ప పువ్వు ..పాలతో వండిన పాయసాలను సమర్పిచి తొలిపూజ చెంచుల నుంచి అందుకున్నాకే అందరికి సలేశ్వర లింగమయ్య దర్శనమిస్తాడు.
అభయారణ్యంలో సాగే అద్భుతమైన ఆధ్యాత్మిక యాత్ర సలేశ్వర లింగమయ్య జాతర. వస్తున్నాం.. వస్తున్నాం.. లింగమయ్య అంటూ భక్తున నామస్మరణలో ఆ ముక్కంటి కొలువైన కొండకోనలు, జలపాతాలు, జాతరవేల పులకరించిపోతాయి. అడుగులు దగ్గరై స్వామి చేరువై ఆ లింగమయ్ దర్శన భాగ్యంతో అంతసేపు పడ్డ ప్రయాస మాయమైభక్తి భావంతో మది నిండిపోతుంది.