Gaza Effected by Cholera: భూగోళంపై ఎక్కడో ఓ చోట పోరాటాలు, సంఘర్షణలు జరుగుతూనే ఉంటాయి. ఆఫ్రికా, పశ్చిమాసియా, దక్షిణాసియా ఎక్కడైనా సరే.. ఆ పోరాటాలు, సంఘర్షణలకు వేలాది మంది బలి కావాల్సిందే. అయితే భీకర యుద్ధాన్ని చవిచూస్తున్న గాజాస్ట్రిప్ మాత్రం ఎంతో భిన్నం. బాంబులు, బుల్లెట్లతో వేలాది మంది పాలస్తీనియన్లు మృత్యుఒడిలోకి చేరుతున్నా.. అంతకు మించి ప్రాణాలను హరించేయగల ముప్పు ఇప్పుడు అక్కడ పొంచి ఉంది.
అత్యధిక జనసాంద్రత కలిగిన గాజాను అంటువ్యాధుల సమస్య తీవ్రంగా కలవరపెడుతోంది. పరిశుభ్రమైన తాగునీరు, పారిశుద్ధ్యం లోపించిన ప్రస్తుత తరుణంలో అంటువ్యాధుల తీవ్రత మరింత పెరగడం ఖాయం. గాజాను వీడిన జనమంతా కిక్కిరిసిన పరిస్థితుల్లో షెల్టర్ తీసుకోవాల్సి వస్తోంది. ఇది మరీ డేంజర్. తాగునీటి కొరత కారణంగా కలుషిత నీరే వారికి శరణ్యమవుతోంది.
ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో రెండు వారాలుగా స్కూళ్లకు స్వస్తి చెప్పిన పిల్లలు.. తాగు నీటిని పొదుపుగా వాడుకోవడం ఎలాగో పాఠాలు నేర్చుకుంటున్నారు. కలుషిత నీటి కారణంగా డీసెంట్రీ, కలరా వంటి వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉంది. కలరా సోకితే డీహైడ్రేట్ కావడమే కాకుండా అతి తక్కువ సమయంలోనే మృత్యుఒడిలోకి చేరతారు. ప్రధానంగా ఇలాంటి ముప్పు పిల్లలకే ఎక్కువని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
దక్షిణ గాజాకే జనాభా మొత్తం పరిమితమైన నేపథ్యంలో ఫ్లూ, ఇతర వైరస్లు అధికమయ్యే ఛాన్స్ ఎక్కువ. ఫలితంగా శ్వాసకోశ వ్యాధులకు బలయ్యే అవకాశాలు లేకపోలేదు. నీటికొరతతో సూపర్ మార్కెట్లు, ప్రైవేటు వ్యాపారులు విక్రయించే బాటిళ్ల ధరలు పెరిగిపోయాయి. గతంలో రూ.600 ఉన్న ధర కాస్తా ఇప్పుడు రెండింతలైంది. నీటికొరతతో పాటు పారిశుద్ధ్య సేవలు లోపించడంతో కలరా ప్రబలే ప్రమాదం ఉందని ఐక్యరాజ్యసమితితో పాటు ఆక్స్ఫాం వంటి స్వచ్ఛంద సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
మురుగునీటిని పంపింగ్ చేసే 65 స్టేషన్లతో పాటు 5 మురుగునీటి శుద్ధి ప్లాంట్లు ఇప్పటికే మూతపడ్డాయి. దీంతో కొన్ని ప్రాంతాల్లో రోడ్లపైకే మురుగునీరు చేరుతోందని ఆక్స్ఫాం వెల్లడించింది. విద్యుత్తు కొరత కారణంగా మునిసిపాలిటీలు నీటిని సరఫరా చేయలేకపోతున్నాయి. అష్టదిగ్బంధంలో చిక్కుకున్నగాజన్లకు తక్షణమే మానవతా సాయం అందించాల్సిన ఆవశ్యకత కనిపిస్తోంది.