AP highcourt additional judges : ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా నియమితులైన హరినాథ్ నూనెపల్లి, కిరణ్మయి మండవ,సుమతి జగడం, న్యాపతి విజయ్ పదవీ ప్రమాణం చేశారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ వీరితో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ఏపీ హైకోర్టు సీజే, న్యాయమూర్తులు, సీఎం జగన్, కొత్త న్యాయమూర్తుల కుటుంబసభ్యులు, తదితరులు హాజరయ్యారు.
న్యాయవాదుల కోటా నుంచి ఈ నలుగురిని న్యాయమూర్తులుగా నియమించాలని ఇటీవల సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫారసులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదముద్ర వేశారు. కేంద్ర న్యాయశాఖ వీరి నియామకానికి ఈనెల 18న ఉత్తర్వులిచ్చింది. ఏపీ హైకోర్టులో మొత్తం 37 మంది న్యాయమూర్తుల పోస్టులకుగానూ ప్రస్తుతం 27 మంది పనిచేస్తున్నారు. వీరిలో ఇద్దరు ఇతర రాష్ట్రాలకు బదిలీ కాగా, కర్ణాటక నుంచి జస్టిస్ నరేందర్ బదిలీపై ఏపీ హైకోర్టుకు వస్తున్నారు. కొత్తగా నియమితులైన నలుగురితో ఏపీ హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 30కి చేరింది.
జస్టిస్ హరినాత్ ఏలూరు సీఆర్ రెడ్డి కాలేజీలో న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. సివిల్ క్రిమినల్ రాజ్యాంగ సంబంధిత కేసుల్లో ఈయనకు మంచి పట్టుందన్న పేరు ఉంది. హైకోర్టులో ఈడీ తరపున కూడా వాదనలు వినిపించారు. 2015లో ఎన్ఐఏకు కూడా న్యాయసహకారం అందించారు. 2020 నుంచి హైకోర్టులో డిప్యూటీ సొలిసిటర్ జనరల్గా విధులు నిర్వహిస్తున్నారు.
జస్టిస్ జగడం సుమతి.. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. 2019లో జిల్లా, మండల పరిషత్లతో పాట గ్రామపంచాయతీలకు స్టాండింగ్ కౌన్సిల్గా పనిచేశారు. 2020 నుంచి హైకోర్టులో గవర్నర్మెంట్ ప్లీడర్గా ఉన్నారు.
ఇక జస్టిస్ న్యాపతి విజయ్ 2012 నుంచి స్వతంత్రంగా ప్రాక్టీస్ చేస్తున్నారు. సివిల్, క్రిమినల్, రెవెన్యూ ట్యాక్స్, పర్యావరణ కేసుల్లో ఈయనకు మంచి పేరుంది.
జస్టిస్ మండవ కిరణ్మయి.. ఉస్మానియా వర్సిటీ నుంచి లా పట్టా తీసుకున్నారు. 2003లో ఆదాయపు పన్ను శాఖ జూనియర్ స్టాండింగ్ కౌన్సిల్గా విధుల్లో చేరారు. 14 సంవత్సరాల పాటు ఆ డిపార్ట్మెంట్కు న్యాయవాదిగా ఉన్నారు. 2016లో సీనియర్ స్టాండింగ్ కౌన్సిల్ నియమితులైనారు. జస్టిస్ కిరణ్మయికి దాదాపుగా 5వేలకు పైగా కేసుల్లో హైకోర్టు ముందు వాదనలు వినిపించిన అనుభవం ఉంది.