Nara Lokesh : ఇందిరాగాంధీ లాంటి వారికే టీడీపీ భయపడలేదని నారా లోకేష్ అన్నారు. అలాంటిది జగన్మోహన్ రెడ్డికి భయపడతామా అని ప్రశ్నించారు. ఎన్ని కుట్రలు చేసినా.. టీడీపీ పోరాటం ఆపేదే లేదని చెప్పారు. టీడీపీ నేతలు, ప్రజా ప్రతినిధులతో టీడీపీ కార్యాలయం వద్ద సమావేశమైన లోకేష్.. సీఎం జగన్ పై ధ్వజమెత్తారు. వచ్చే వారం నుంచి నిజం గెలవాలని పేరుతో భువనేశ్వరి ప్రజల్లోకి వెళ్తోందని తెలిపారు. అటు, నవంబర్ 1 నుంచి భవిష్యత్ కి బాబు భరోసా కార్యక్రమం తానే చేస్తానని లోకేష్ ప్రకటించారు. టీడీపీ, జనసేన మధ్య విభేదాలు సృష్టించడానికి వైసీపీ కుట్రలు చేస్తోందని ఆరోపించారు. ఈ విషయంలో టీడీపీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని కోరారు.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా ట్వీట్ పెట్టినా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడినా.. వారందరిపై దొంగకేసులు పెట్టి.. సైకో జగన్ జైలుకు పంపిస్తున్నాడని లోకేష్ ఆరోపించారు. తెలుగుదేశం- జనసేన .. వైసీపీకి ఎదురెళ్లి పోరాటం చేయకపోతే రాష్ట్రాన్ని ముక్కలు ముక్కలుగా నరికి ఒక్కోభాగాన్ని ఒక్కో నాయకుడికి ఇస్తాడని ధ్వజమెత్తారు. ప్రజల తరపున పోరాడినందుకే చంద్రబాబును జగన్ జైలుకు పంపారని, అయినా తమ పోరాటం ఆగదన్నారు. జగన్ పై శాంతియుతంగా పోరాటం చేసి.. ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి.. సైకో జగన్ ను రాబోయే ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు.
ప్రస్తుతం రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీని అమలు చేస్తున్నారని నారా లోకేష్ విమర్శించారు. టీడీపీ ఓట్లను కూడా తొలగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తే.. 175కి 160 స్థానాలు గెలవడం ఖాయమని లోకేష్ ధీమా వ్యక్తం చేశారు. నవంబర్ 1వ తేదీ నుంచి బాబు షూరిటీ.. భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని ప్రారంభించి 45 రోజుల పాటు ప్రజల్లో చైతన్యం తీసుకురావాలన్నారు. అలాగే వచ్చేవారం నుంచి భువనేశ్వరి నిజం గెలవాలి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు లోకేష్ తెలిపారు. టీడీపీ సూపర్ 6 అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.