Ravindra Jadeja catch : ఈసారి ఫీల్డర్ మెడల్ నాకే.. అంటూ సైగలు చేసి అందరి దృష్టిని ఆకర్షించిన రవీంద్ర జడేజా చెప్పిందే నిజమైంది. వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా ఇండియా-బంగ్లాదేశ్ మధ్య జరిగిన మ్యాచ్ లో బెస్ట్ ఫీల్డర్ అవార్డు జడేజాకే దక్కింది. టీమ్ ఇండియా మేనేజ్మెమెంట్ ప్రతి మ్యాచ్ కు అందించే ఫీల్డర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుకు ఈ మ్యాచ్ లో జడేజాను ఎంపిక చేసింది.
అయితే ఇదే మ్యాచ్ లో కీపర్ కేఎల్ రాహుల్ గాల్లోకి డైవ్ చేస్తూ క్యాచ్ అందుకున్నాడు. అయితే దానికన్నా మిన్నగా జడ్డూ క్యాచ్ నిలవడంతో న్యాయనిర్ణేతలు ఇటువైపే ఓటు వేశారు. వీరిద్దరితోపాటు కుల్దీప్ కూడా బెస్ట్ ఫీల్డర్ కాంపిటేషన్ లో పోటీపడ్డాడు. అయితే క్యాచ్ కాదు కానీ చాలా బౌండరీలను సమర్థవంతంగా అడ్డుకున్నాడు. అందుకని తను కూడా బెస్ట్ ఫీల్డర్ రేస్ లోకి వచ్చేశాడు. మొత్తానికి జడేజాకు అవార్డు వరించింది. అయితే అవార్డు రాలేదన్నంత మాత్రాన వీరిద్దరినీ తక్కువగా చూడలేమని క్రీడా పండితులు అంటున్నారు.
బంగ్లాదేశ్ బ్యాటింగ్ చేస్తోంది. అప్పుడు 43 ఓవర్ నడుస్తోంది. మ్యాచ్ మంచి రవసవత్తరంగా ఉంది. ముష్పికర్ మంచి ఫామ్ లో ఉండి ఎడా పెడా కొడుతున్నాడు. బూమ్రా బౌలింగ్ లో షాట్ కొట్టాడు. వెంటనే పాయింట్ దగ్గరున్న జడేజా అద్భుతంగా గాలిలో డైవ్ చేసి చటుక్కున పట్టేశాడు. అందరికీ ఈసారి గోల్డ్ మెడల్ నాదే అంటూ చేసిన సైగలు నెట్టింట వైరల్ అయ్యాయి. అంతకుముందు మ్యాచ్ లో బెస్ట్ ఫీల్డర్ విన్నర్ అయిన కేఎల్ రాహుల్ అందరూ అభినందిస్తుండగా గోల్డ్ మెడల్ ను జడేజా మెడలో వేశాడు.
బహుశా అవార్డు మహిమో, మరేమిటో తెలీదుకానీ ఫీల్డింగ్ లో మనవాళ్లు గతంలో కన్నా మెరుగయ్యారు. చాలా గొప్పగా కదులుతున్నారు. చిరుతల్లా పరుగులు తీస్తున్నారు. అద్భుతమైన డైవింగులు చేస్తున్నారు. అంటే ఈసారి వరల్డ్ కప్ ను ఎవరూ తేలికగా తీసుకోవడం లేదని అర్థమైంది. ఎందుకంటే ఇండియాలో నిర్వహించడం కారణంగా ప్రెస్టేజియస్ గా తీసుకుంటున్నారని కూడా అంటున్నారు. అందుకే అందరూ చావో రేవో అన్నట్టే ఆడుతున్నారు.అందుకు తగినట్టుగానే వరుసగా నాలుగు మ్యాచ్ ల్లో జయభేరి మోగించి.. న్యూజిలాండ్ తో సమానంగా నిలిచారు.