Denmark Open 2023 : ఒకప్పటి సింధూని మళ్లీ అందరికీ గుర్తు చేసేలా డెన్మార్క్ ఓపెన్ లో ఆడుతోంది. తన మునుపటి పోరాట పటిమను చూపిస్తూ డెన్మార్క్ ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నీ లో భారత స్టార్ క్రీడాకారిణి పీవీ సింధు సెమీస్ కి దూసుకుపోయింది.
శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో థాయ్లాండ్కు చెందిన సుపానిడా కాటేథాంగ్పై 21-19, 21-12 తేడాతో గెలిచింది. ఇది ప్రత్యర్థిపై ఏకపక్ష విజయంగా అందరూ అభివర్ణిస్తున్నారు. ఏ దశలోనూ ప్రత్యర్థి కోలుకోడానికి అవకాశం ఇవ్వలేదు. మొదటిసెట్ హోరాహోరీగా సాగింది. ఆసక్తికరంగా కూడా సాగింది. ప్రతి పాయింట్ కు ఇద్దరూ పోటీపడి ఆడారు. అయితే ఈ దశలో 5-2 తో సింధు వెనుకపడింది. అంతా అయిపోయిందని అనుకున్నారు. కానీ సింధు ఎక్కడా ప్రత్యర్థికి ఆధిపత్యానికి తలొగ్గకుండా ఆడింది. 8-8తో సమం చేసింది. చివరికి ఈ పోరాటంలో ప్రత్యర్థి కాటేథాంగ్ 19 పాయింట్లు సాధించి గట్టి పోటీనే ఇచ్చింది. తనింకో రెండు పాయింట్లు కొడితే మళ్లీ నువ్వా నేనా అన్నట్టు సాగేది. ఆ డేంజర్ జోన్ లోకి వెళ్లకుండా, తన అనుభవాన్నంత కూడదీసుకుని సింధూ మొదటి సెట్ గెలిచింది.
తర్వాత రెండో సెట్ ప్రారంభమైన తర్వాత కాటేథాంగ్ గట్టి పోటీనే ఇచ్చింది. సింధూను బాగా టెన్షన్ పెట్టింది. అయితే సింధు మళ్లీ కోర్టులో చిరుతలా కదిలి ప్రత్యర్థిని 12 పాయింట్ల దగ్గర ఆగేలా కట్టడి చేసింది. మొత్తానికి సింధు వరుస సెట్లను గెలుచుకుని సెమీస్ లోకి దూసుకెళ్లింది. అయితే ఇక్కడ విశేషం ఏమిటంటే రెండు సెట్లను 47 నిమిషాల్లోనే సింధు ముగించింది. ఈ స్పీడును చూసి సింధు పాతరోజుల్లో ఆడినట్టుగా ఉందని సీనియర్లు కొనియాడుతున్నారు.
సెమీస్ లో కరోలినా మారీన్ (స్పెయిన్), లేదంటే తాయ్ టుయింగ్ (తైవాన్)తో సింధూ పోటీ పడనుంది. కానీ ఇప్పటి ఉత్సాహం చూస్తుంటే ఈసారి మెగా టోర్నీలో విన్నర్ అయ్యేలా కనిపిస్తోంది.
రెండుసార్లు ఒలింపిక్ పతకం సాధించిన పీవీ సింధు ఇటీవల జరిగిన ఆసియా క్రీడల్లో నిరాశపరిచింది. అయితే మళ్లీ తన మునుపటి ఫామ్ ను అందిపుచ్చుకుని అంతర్జాతీయ టోర్నమెంట్లలో సత్తా చాటుతోంది.