ఏపీలో అమ్మఒడి ప్రకంపనలు రాజుకున్నాయి. అమ్మఒడి పేరుతో జగన్ ప్రభుత్వం 743 కోట్ల రూపాయలను దోచుకుందని జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్ అన్నారు. విప్లవాత్మక మార్పుల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం విద్యావ్యవస్థను నాశనం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. టోఫెల్ పరీక్ష పేరుతో ఇప్పటికే ఏడాదికి రూ.1056 కోట్ల ప్రజాధనాన్ని వృథా చేస్తోందని మండిపడ్డారు. ఇప్పుడు ఐబీ సంస్థతో ప్రభుత్వం మరో ఒప్పందానికి సిద్ధమైందని.. దాని వలన విద్యా విధానానికి నష్టం జరుగుతుందని ధ్వజమెత్తారు.
మనోహర్ ఆరోపణలపై మంత్రి బొత్స స్పందించారు. టోఫెల్, ఐబీ సంస్థల ఎంపికకు టెండర్లు పిలవాల్సిన అవసరం లేదని తెలిపారు. టోఫెల్, ఐబీ అత్యుత్తమమని భావిస్తున్నామని.. అందుకే ఆ సంస్థలతో ఒప్పందం చేసుకుని ముందుకెళ్తున్నామని అన్నారు. ఇందులో ఆర్థిక సంబంధమైన అంశాలు గానీ.. ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్టు ఈ స్థాయిలో చెల్లింపులు ఏమీ లేవని అన్నారు. ఒప్పందంలో ఎక్కడైనా ఆర్థిక చెల్లింపులుంటే జనసేన పార్టీ నాయకుడు చూపించాలి. పేదవాళ్లకు నాణ్యమైన విద్య అందకూడదా? అని ప్రశ్నించారు. పేదలకు మంచి చేస్తుంటే ప్రతిపక్షాలు ఓర్చుకోలేకపోతున్నాయని బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐబీని మహారాష్ట్ర, హర్యానా, ఢిల్లీల్లో కూడా అమలు చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వం అన్నీ పారదర్శకంగానే చేస్తోందని.. ఇందులో దాగుడు మూతలు లేవని చెప్పారు. ఐఏఎస్లతో కమిటీ ఏర్పాటు చేశామని.. ఆ కమిటీ సూచనతో ఐబీని ఎంపిక చేశామని చెప్పారు.
బొత్స కామెంట్స్ కి జనసేన అధినేత పవన్ కల్యాణ్ కౌంటర్ ఇచ్చారు. ప్రభుత్వం మారిన వెంటనే వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అవినీతి, కుంభకోణాలపై దృష్టిపెడతామని పవన్ కళ్యాణ్ అన్నారు. మొదట విద్యా శాఖ నిధుల్లో అవినీతి , కుంభకోణంతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరినీ జైలుకి పంపుతామని హెచ్చరించారు. పతనావస్థలో ఉన్న కంపెనీలకు కాంట్రాక్టులు ఇచ్చి విద్యా వ్యవస్థను నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి విద్యా వ్యవస్థలో చాలా అవకతవకలు జరిగాయని పవన్ ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం విద్యార్ధులను అయోమయానికి గురి చేస్తోందని విమర్శించారు. ఇంగ్లీష్ మీడియం విషయంలో సలహాలు ఇచ్చే ప్రయత్నం చేస్తే.. తామేదో ఇంగ్లీష్ మీడియానికి వ్యతిరేకం అన్నట్లు ప్రచారం చేయడం సరికాదని పవన్ అన్నారు. మనోహర్, బొత్స వ్యాఖ్యలకు పవన్ వార్నింగ్ కూడా తోడవ్వడంతో.. అమ్మఒడి వివాదం పీక్స్ కి చేరింది.