Pawan Kalyan : ఏపీలో జనసేనాని వ్యాఖ్యలు హాట్ టాపిక్గా మారాయి. మంగళగిరి జనసేన ఆఫీస్లో జరిగిన పార్టీ ముఖ్య నేతల భేటీలో పవన్కల్యాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎం పదవికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో జగన్ను గద్దె దించడమే లక్ష్యంగా పని చేయాలని.. టీడీపీ-జనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని జనసైనికులకు పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి పదవి కంటే ప్రజల భవిష్యత్తు ముఖ్యమని.. ఒకటి రెండు చోట్ల ఇబ్బందులు ఉన్నప్పటికీ ముందుకెళ్లాలని సూచించారు. తానెప్పుడూ సీఎం పదవికి విముఖత చూపలేదని.. ముఖ్యమంత్రి పదవిపై సుముఖంగానే ఉంటానని అన్నారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. రాబోయే ఎన్నికల్లో ప్రభుత్వం మారిన తర్వాత ప్రస్తుత అధికార పార్టీ చేసిన విద్యాశాఖ కుంభకోణాలపై దృష్టి పెడతామన్నారు. అవినీతితో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరినీ జైలుకి పంపుతామని పవన్ తెలిపారు. వైసీపీ ప్రభుత్వం మొదటి నుంచీ విద్యావ్యవస్థను దుర్వినియోగం చేస్తోందన్నారు. విద్యార్థులకు ఐబీ సిలబస్ అమలు వెనుక పెద్ద కుంభకోణం ఉందని పవన్ ఆరోపించారు. విద్యార్థులు ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడేందుకు ఇన్ని వేల కోట్ల ఖర్చవుతుందా అని ప్రశ్నించారు. దీనిపై వైసీపీ ప్రభుత్వం వివరణ ఇవ్వాలన్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ తర్వాత.. ఏపీలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. చంద్రబాబుకు మద్దతు తెలిపిన ఆయన.. ఆ పార్టీతో జతకట్టి జగన్ను గద్దె దించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ఇక త్వరలో రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో టీడీపీతో కలిసి గెలుపుబావుట ఎగురవేయాలన్న సంకల్పంతో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే పవన్కల్యాణ్ సీఎం పదవిపై కీలకవ్యాఖ్యలు చేశారు. అయితే,.. చంద్రబాబు వారసుడిగా లోకేష్, నందమూరి వారసుడిగా బాలకృష్ణ టీడీపీలో కీలక నేతలుగా ఉన్న పరిస్థితుల్లో.. ప్రతిపక్షాలు ఆశిస్తున్నట్టు టీడీపీ-జనసేనల ప్రభుత్వం ఏర్పాటైతే వారిద్దరి పేర్లు కూడా తెరపైకి వచ్చే అవకాశముంది. మరి భవిష్యత్తులో ఏం తేలనుందో తెలియాలంటే ఎన్నికలు జరిగి.. ఫలితాలు వెల్లడయ్యే వరకూ వేచి చూడాల్సిందే.