Congress Vijayabheri Yatra : తెలంగాణలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ ప్రచార ప్రభంజనం దుమ్ములేపింది. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అధికార పగ్గాలు చేపట్టడమే లక్ష్యంగా.. రాష్ట్రంలో పూర్వవైభవాన్ని నెలకొల్పడమే టార్గెట్గా ముందుకు సాగుతోంది కాంగ్రెస్ పార్టీ. ఈ మేరకు ప్రచారంలో దూసుకుపోతోంది. ఈనేపథ్యంలో విజయభేరీ పేరుతో మూడు రోజులపాటు సాగిన బస్సుయాత్ర సూపర్ సక్సెస్ అయింది. ఊరూరా రాహుల్గాంధీకి ఘనస్వాగతం పలుకుతూ పెద్ద ఎత్తున ప్రచారంలో భాగమయ్యారు ప్రజలు. అగ్రనేతతో కలిసి అడుగులో అడుగు వేస్తూ పాదయాత్రను దిగ్విజయం చేశారు.
కేంద్ర, రాష్ట్ర వైఫల్యాలను ప్రజల్లో ఎండగడుతూ రాహుల్గాంధీ యాత్ర సాగింది. ఈ సందర్భంగా ఆయన మోదీ, కేసీఆర్ సర్కార్లపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణలో దొరలపాలనను అంతమొందించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. వచ్చేది తమ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రజలకు ఏం చేస్తారో చెబుతూ భరోసానిచ్చారు. పేదలందరికీ అండగా ఉంటానని హామీ ఇచ్చారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా రాహుల్గాంధీ ములుగు, భూపాలపల్లి, మంథని, పెద్దపల్లి, కరీంనగర్, జగిత్యాల, చొప్పదండి, ఆర్మూర్ నియోజక వర్గాలలో బస్సుయాత్ర, పాదయాత్రలతో ప్రజా సమస్యలపై ఆరా తీశారు. రాహుల్ టూర్ సక్సెస్ కావడంతో పార్టీ శ్రేణులు ఫుల్ జోష్లో ఉన్నారు. నూతనోత్సాహంతో ఉన్న కాంగ్రెస్ నేతలు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు.